అమెరికాలో దాడి.. విషమంగానే ఖమ్మం యువకుడి పరిస్థితి

2 Nov, 2023 13:40 IST|Sakshi

చికాగో: అమెరికా చికాగోలో దుండగుడి చేతిలో కత్తిపోట్లకు గురైన ఖమ్మం యువకుడు వరుణ్ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. గత మూడు రోజులుగా ఆయనకు వెంటిలేటర్‌ మీదనే చికిత్స కొనసాగుతోందని వైద్యులు తెలిపారు. ఆరోగ్య పరిస్థితి దృష్యా వరుణ్‌ని ఫోర్ట్ వేన్‌లోని లూథరన్ ఆసుపత్రికి తరలించారు.

ఖమ్మంలోని బుర్హాన్‌పురంలో నివసిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు పుచ్చా రామ్మూర్తి కుమారుడు వరుణ్‌ చికాగోలో ఉంటూ ఎంఎస్‌ చదువుతున్నాడు. ఈ నెల 29న జిమ్‌ నుంచి బయటకు వస్తున్న వరుణ్‌పై అకస్మాత్తుగా ఓ దుండగుడు కత్తితో దాడి చేశాడు. తీవ్రగాయాలపాలైన వరుణ్‌ రక్తపు మడుగులో పడిపోగా స్థానికుల  సమాచారంతో పోలీసులు వచ్చి  ఆస్ప త్రికి తరలించారు. 

ఈ కేసులో నిందితుడు ఆండ్రేడ్‌ జోర్డాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వరుణ్ రాజ్‌పై జరిగిన దాడితో మేము దిగ్భ్రాంతి చెందామని వాల్పరైసో విశ్వవిద్యాలయం ప్రెసిడెంట్ జోస్ పాడిల్లా అన్నారు. అటు వరుణ్ చికిత్స ఖర్చుల కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) గో ఫండ్‌ మీ(GoFundme)లో నిధుల సమీకరణను ప్రారంభించింది. బుధవారం రాత్రికి 38,000 డాలర్లకు పైగా సమీకరించింది.

అమెరికాలో నివసిస్తున్న వారి బంధువు సాయివర్ధన్‌ ఫోన్‌ చేసి వరుణ్‌ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. కాగా, తాము అమెరికా వెళ్లేందుకు సహకరించాలని మంత్రి పువ్వాడ అజయ్‌ను కోరినట్లు రామ్మూర్తి తెలిపారు. 

ఇదీ చదవండి: అమానవీయం: రక్తపు మడుగులో ఫిల్మ్‌మేకర్‌.. ఫోన్, కెమెరా దొంగతనం

మరిన్ని వార్తలు