మా మబ్బులు పోయాయి..  మీరెక్కడైనా చూశారా..! 

8 Jul, 2018 01:48 IST|Sakshi

మా ఇంట్లో దొంగతనం జరిగిందండీ.. బంగారం, డబ్బు పోయింది.. విలువైన వస్తువులు పోయాయి.. అవి పోయాయి.. ఇవి పోయాయని పోలీసులకు ఫిర్యాదు చేస్తారు.. అయితే ఇరాన్‌ అనే దేశం ఉంది కదా.. అది కూడా ఇజ్రాయెల్‌ అనే దేశంపై ఫిర్యాదు చేసింది. ఇంతకీ ఇజ్రాయెల్‌ ఏం చేసిందో తెలుసా.. దొంగతనం చేసిందట. అవునా దేశాలు కూడా దొంగతనాలు చేస్తాయా అనుకుంటున్నారా.. ఇజ్రాయెల్‌ ఏం దొంగతనం చేసిందో తెలిస్తే షాక్‌ అవుతారు. ఇరాన్‌కు మాత్రమే సొంతమైన మేఘాలను దొంగతనం చేసిందట. అదేంటి మేఘాలను దొంగతనం చేయడం ఏంటి? అయితే ఇదేదో ప్రాంక్‌ చేసే వార్త కాదు.

నిజంగానే ఇజ్రాయెల్‌ దొంగతనం చేస్తోందని ఇరాన్‌ మిలిటరీ జనరల్‌ గోలం రెజా జలాలీ మీడియాకు వెల్లడించారు. దీంతో ఇరాన్‌లో వర్షం రాకుండా చేస్తోందని పెద్ద అభియోగమే మోపాడు. అంతేకాదు వచ్చిన మేఘాలను కూడా వర్షం కురవకుండా చేస్తోందని ఆరోపించాడు. ఇందుకే తమ దేశంలో ఎప్పటినుంచో కరువు తాండవిస్తోందని, దీనికి కారణం ఇజ్రాయెల్‌ అని విరుచుకుపడ్డాడు ఆ పెద్దాయన. ఇంకో విషయం తమ దేశంలోని మంచును కూడా ఇజ్రాయెల్‌ దొంగిలిస్తోందట. ఈయన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా నవ్వులపాలయ్యాయి. కాగా, మేఘాలను, మంచును దొంగిలించడమేంటి.. అసలు అది సాధ్యమే కాదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. పాపం మరి ఏమి చేసి వారి మేఘాలను కాపాడుకుంటారో చూడాల్సిందే.  

మరిన్ని వార్తలు