వీడియో షేర్‌ చేసిన ప్రధాని.. నెటిజన్ల ఫైర్‌!

13 Apr, 2020 12:51 IST|Sakshi

జపాన్‌ ప్రధాని షింజో అబేపై నెటిజన్ల విమర్శలు

టోక్యో: కరోనా(కోవిడ్‌-19) మహమ్మారి విస్తరిస్తున్న వేళ ట్విటర్‌లో ఓ వీడియోను షేర్‌ చేసిన జపాన్‌ ప్రధాని షింజో అబే నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ‘అసలు మీరు ఎవరో మీకైనా తెలుసా’ అంటూ ట్విటర్‌ యూజర్లు ఆయనపై విరుచుకుపడుతున్నారు. జపాన్‌లో ఇప్పటి వరకు దాదాపు ఏడు వేల మందికి పైగా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలో వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితి విధించాలని ప్రధాని షింజో అబే నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు అనుగుణంగా ఆయా చోట్ల విద్యా సంస్థల మూసివేత, జన సమ్మర్ధం ఎక్కువగా ఉండే చోట్లలో ఆంక్షలు విధించడం వంటి చర్యలు చేపట్టారు.(కరోనా: మీ పౌరులను తీసుకువెళ్లండి.. లేదంటే..)

ఈ క్రమంలో ప్రజలను ఇంటి వద్దే ఉండాల్సిందిగా సూచించిన షింజో అబే.. ‘‘ నా స్నేహితులను కలుసుకోలేను. పార్టీలకు వెళ్లలేను. ఈ పరిస్థితుల్లో ప్రాణాలను నిలబెట్టేందుకు ఎంతో మంది వైద్య సిబ్బంది కఠిన శ్రమకోర్చి సేవలు అందిస్తున్నారు. వారి పట్ల కృతజ్ఙతా భావం చాటుకోవాలి’’ అంటూ ఓ వ్యక్తి గిటార్‌ వాయిస్తున్న వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. సోఫాపై కూర్చుని... కుక్క పిల్లను ఒళ్లో ఆడిస్తున్న ప్రధాని వీడియో దృశ్యాలను చూసిన నెటిజన్లు ఆయనపై మండిపడుతున్నారు. ‘‘సేవలు చేస్తున్న వారికి ధన్యవాదాలు చెప్పాల్సిందే. అయితే ఒక విషయం చెప్పండి. అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు. మీరు ఎవరో మీకైనా తెలుసా. ప్రజలంతా విపత్కర పరిస్థితుల్లో విలవిల్లాడుతుంటే.. బాధ్యతగా వ్యవహరించాల్సిన మీరిలా విలాసవంతమైన జీవితం ఎలా గడుపుతున్నారు’’ అంటూ విమర్శల వర్షం కురిపించారు. దీంతో Who do you think you are? ట్రెండింగ్‌లో నిలిచింది.(వీధుల్లోనే కరోనా మృతదేహాలు)

మరిన్ని వార్తలు