టర్కీలో భారీ భూకంపం; 18మంది మృతి

25 Jan, 2020 08:50 IST|Sakshi

ఇస్తాంబుల్‌ : టర్కీ తూర్పు ప్రాంతంలో ఉన్న ఇలాజిజ్‌ ఫ్రావిన్స్‌లోని సివ్‌రిస్‌ జిల్లాలో భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 6.8గా నమోదైంది. ఈ ఘటనలో సుమారు 18 మంది మృతి చెందగా, 500మందికి పైగా గాయాలపాలయ్యారు. భూకంపం ధాటికి నివాసితులు ఇళ్లు వదిలి వీధుల్లోకి పరుగెత్తారు. భూకంపం తర్వాత 60 సార్లు భూమి కంపించిందని టర్కీ విపత్తు, అత్యవసర నిర్వహణ అథారిటీ తెలిపింది. పొరుగు దేశాలైన సిరియా, లెబనాన్‌లోనూ భూప్రకంపనలు సంభవించాయి. కాగా భూకంపం దాటికి కూలిన భవనాలలో చిక్కుకున్నవారిని కాపాడేందుకు 400 మంది సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. టర్కీలో భూకంపాలు రావడం కొత్తేం కాదు. 1999లో టర్కీలోని ఇజ్‌మిత్‌ సిటీలో చోటుచేసుకున్న భారీ భూకంపం దాటికి దాదాపు 17వేల మంది మృత్యువాత పడ్డారు. 

మరిన్ని వార్తలు