చంద్రునిపై నీరు.. చంద్రయాన్‌-1 దృవీకరణ

21 Aug, 2018 20:58 IST|Sakshi

చంద్రునిపై మంచు, నీరు ఉన్నట్లు నిర్థారించిన నాసా

సమాచారం అందించిన చంద్రయాన్‌-1 మిషన్‌

వాషింగ్టన్‌ : చంద్రునిపై నీటి, మంచు నిక్షేపాలు ఉన్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా వెల్లడించింది. చంద్రునిపై ఘన స్థితిలో పలు ప్రాంతాల్లో నీటి నిక్షపాలు ఉన్నట్లు మంగళవారం నాసా ప్రకటించింది. పదేళ్ల క్రితం భారత్‌ ప్రయోగించిన చంద్రయాన్‌-1 మిషన్‌ అందించిన సమాచారం ద్వారా ఈ అంశాలను విశ్లేషించిన నాసా వాటిని నిర్ధారించింది. చంద్రయాన్‌-1 అందించిన సమాచారాన్ని ప్రకారం చంద్రునిపై గల శీతల భాగాల్లో మంచు నిక్షేపాలు కూడా ఉన్నాయని నాసా వెల్లడించింది. భవిష్యతుల్లో చంద్రుడిపైకి వెళ్లె యాత్రికులకు అక్కడ నివసించడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని నాసా పేర్కొంది.

చంద్రుని దక్షిణ ద్రువం వద్ద మంచు కేంద్రీకృతమై ఉందని.. ఆ మంచు పొరలు ఉత్తర దృవం వద్ద మరింత విస్త్రతంగా లభిస్తాయని పేర్కొంది. 2008లో ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్‌-1పై ఎం3 అనే పరికరాన్ని నాసా అమర్చిన విషయం తెలిసిందే. నాసాకు చెందిన ఎం3 పరికరం ద్వారా అక్కడి సమాచారాన్ని, మంచు, నీరు జాడలను సేకరించింది. చంద్రుని ధ్రువాల వద్ద ఎక్కువ మంచు ఉందని.. అక్కడ ఉష్ణోగ్రత -156 డిగ్రీలకు మించదని శాస్త్రవేత్తలు తెలిపారు. కాగా గతంలోనే చంద్రునిపై పలు పరిశోధనలు చేసిన నాసా చంద్రునిపై నీరు, మంచు ఉండే అవకాశాలు ఉన్నాయని పరోక్షంగా ప్రకటించిన విషయం తెలిసిందే.


 

మరిన్ని వార్తలు