మతిమరుపు వ్యాధికి మందు వచ్చేసింది

2 Jan, 2020 03:04 IST|Sakshi

చైనాలో మార్కెట్‌లోకి జీవీ971 

బీజింగ్‌: తీవ్ర మతిమరుపు వ్యాధి అయిన అల్జీమర్స్‌ను నయం చేసేందుకు చైనాలో కొత్త మందు మార్కెట్లోకి వచ్చింది. దీంతో ఈ వ్యాధితో బాధపడుతున్న కొన్ని లక్షల మందికి ఎంతో ఊరట చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బ్రౌన్‌ ఆల్గే (శైవలం) నుంచి సంగ్రహించిన ఈ మందు.. అల్జీమర్స్‌ వ్యాధికి ప్రపంచంలోనే కనుగొన్న మొట్ట మొదటిదని చైనాలోని నేషనల్‌ మెడికల్‌ ప్రోడక్ట్స్‌ అడ్మినిస్ట్రేషన్‌ అధికారులు పేర్కొన్నారు.

జీవీ–971గా పిలుస్తున్న ఈ మందుకు నవంబర్‌ 2న అధికారికంగా చైనా ప్రభుత్వం అనుమతులిచ్చింది. కాగా, ఆదివారం నుంచి మార్కెట్‌లోకి వచ్చినట్లు అధికారులు చెప్పారు. ఏడాది పాటు వాడాలంటే ఒక రోగికి దాదాపు రూ.4 లక్షలు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ మందును చైనాలో మెడికల్‌ ఇన్సూరెన్స్‌ జాబితాలో చేర్చే ప్రయత్నం చేస్తామని, దీంతో రీయింబర్స్‌మెంట్‌ చేసుకునే వీలు కలుగుతుందని షాంఘై గ్రీన్‌ వ్యాలీ ఫార్మాసూటికల్స్‌ చైర్మన్‌ సొంగ్‌టావో తెలిపారు.   

మరిన్ని వార్తలు