ఆర్టికల్‌ 370 రద్దు; పాక్‌ సంచలన నిర్ణయం

7 Aug, 2019 20:41 IST|Sakshi

ఇస్లామాబాద్‌: జమ్మూ కశ్మీర్‌పై భారత్‌ ప్రభుత్వం చారిత్రక నిర్ణయాల నేపథ్యంలో పాకిస్తాన్‌ మరోసారి దిగజారి వ్యవహరించింది. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించేందుకు రాజ్యాంగంలోని 370వ అధికరణాన్ని రద్దు చేసే తీర్మానాన్ని, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టే బిల్లును భారత ప్రభుత్వం ఆమోదించడాన్ని నిరసిస్తూ పాకిస్తాన్‌ ఆక్రోశం వెళ్లగక్కింది. భారత్‌తో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రద్దు చేసుకుంది. తమ దేశం నుంచి భారత రాయబారిని బహిష్కరించింది. ఢిల్లీలోని తమ రాయబారిని వెనక్కి పిలిపిస్తామని పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రి షా మహమూద్‌ ఖురేషి తెలిపారు. జమ్మూ కశ్మీర్‌పై భారత్‌ సంచలన నిర్ణయం నేపథ్యంలో పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ అధ్యక్షతన నేషనల్‌ సెక్యురిటీ కమిటీ(ఎన్‌ఎస్‌ఈ) బుధవారం అత్యవసరంగా సమావేశమైంది. రక్షణ, విదేశాంగ మంత్రులు, త్రివిధ దళాల అధిపతులు, ఐఎస్‌ఐ డైరెక్టర్‌ ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

భారత్‌తో ద్వైపాక్షిక ఒప్పందాలను సమీక్షించాలని ఈ భేటీలో నిర్ణయించారు. ఇండియా ఫాసిస్ట్‌ విధానాలను దౌత్య మార్గాల ద్వారా ప్రపంచానికి తెలియజేయాలని ఇమ్రాన్‌ఖాన్‌ ఆదేశించినట్టు పాకిస్తాన్‌ ఒక ప్రకటనలో తెలిపింది. పాకిస్తాన్‌ స్వాతంత్ర్య దినం ఆగస్టు 14న కశ్మీర్‌లకు సంఘీభావ దినంగా, ఆగస్టు 15న చీకటి దినంగా పాటించాలని నిర్ణయించింది. కాగా, కశ్మీర్‌కు స్వతంత్రప్రతిపత్తిని రద్దు చేస్తూ భారత్‌ తీసుకున్న నిర్ణయంతో పుల్వామా తరహా దాడి ఇమ్రాన్‌ఖాన్‌ మంగళవారం వ్యాఖ్యానించారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో రెండు అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధలాంటి పరిస్థితులు ఉత్పన్నం కావచ్చొచ్చు. కశ్మీరీలు నిరసనలు తెలిపితే భారత్‌ వారిని అణచివేయవచ్చు. కశ్మీర్‌ పరిస్థితులను గమనిస్తూ ఉండాలి’ అని ఆయన అంతర్జాతీయ సమాజాన్ని కోరారు.

మరిన్ని వార్తలు