....చూస్తేనే వాంతి వస్తోంది!

8 Jan, 2016 20:37 IST|Sakshi
....చూస్తేనే వాంతి వస్తోంది!

సైబర్ సిక్నెస్... ఆధునిక యుగంలో ఓ కొత్త వ్యాధిగా మారింది. ముఖ్యంగా టెక్నాలజీని అధికంగా వాడేవాళ్ళలో ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వ్యాధితో బాధపడేవారు నీరస పడిపోవడంతో పాటు... ముఖ్యంగా ల్యాప్ టాప్ లు, ఫోన్లు వాడిన వెంటనే వీరిలో వాంతి లక్షణాలతో కూడిన అనారోగ్యం చోటు చేసుకోవడం కనిపిస్తోంది. ఇప్పుడు టెక్నాలజీని వాడుతున్న జనాభాలో 80 శాతం మందిని ఈ సైబర్ సిక్నెస్ వేధిస్తోంది.

స్కైప్, ఫేస్ బుక్, ఈ మెయిల్ వంటి ఆధునిక టెక్నాలజీ పుణ్యమాని ఢెభ్భై ఏళ్ళ అమ్మమ్మలు, తాతలు కూడా  ప్రపంచవ్యాప్తంగా ఉన్న బంధుమిత్రులతో, స్నేహితులతో టచ్ లో ఉండగల్గుతున్నారు. ''మా కూతురు దుబాయ్ లో, మా అక్క ఫ్రాన్స్ లో, మా బంధువులు చాలా మంది ఆస్ట్రేలియాలో ఉన్నారు. వారందరినీ స్క్రీన్ లో చూసి మాట్లాడగల్గుతున్నాను. వాళ్ళెక్కడున్నారు, ఏం చేస్తున్నారు అన్నీ చూడగల్గుతున్నాను'' అంటుంది ఆగ్నేయ వేల్స్ లోని మన్మౌత్ షైర్ దేశానికి చెందిన 76 ఏళ్ళ జూన్. ఆమె తన వారందరితో సంబంధ బాంధవ్యాలను పెంచుకునేందుకు టెక్నాలజీని పెద్ద ఆయుధంగా వాడుకుంటోంది. అంతేకాదు ఆమె ఒకప్పుడు ఐబీఎం లో కంప్యూటర్ ప్రోగ్రామర్ గా కూడా పనిచేసింది. అయితే ప్రస్తుతం జూన్ సైబర్ సిక్నెస్ తో బాధపడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఎనభై శాంతం మందిలో కనిపిస్తున్న ఈ వ్యాధి ఇప్పుడు జూన్ కూ సంక్రమించింది. కాసేపు టచ్ స్క్రీన్ ఫోన్లో మాట్లాడినా, కొద్ది సెకన్లు ల్యాప్ టాప్ ను చూసినా  కడుపులో తిప్పడం, వాంతి వచ్చినట్టు అనిపించడం ఇప్పడు జూన్ ను వేధిస్తున్నాయి.  

ముఖ్యంగా వాంతి వచ్చినట్లు అనిపించడం, తలతిప్పడం, తలనొప్పి వంటివి సైబర్ సిక్నెస్ లక్షణాలు. స్క్రీన్ లో వచ్చే కదలికలకు మెదడు స్పందింస్తుంది. కానీ శరీరం పెద్దగా స్పందించదు. ఇటువంటి సందిగ్ధావస్థలో కడుపులో తిప్పడం, వాంతి వచ్చినట్లు అనిపించడం జరుగుతుంది. ఇటువంటి మార్పులు ఏ వయసులోనైనా వచ్చే అవకాశం ఉంది. తైవాన్ లోని  కావ్ షూయింగ్ విశ్వవిద్యాలయం అధ్యయనకారులు ఏభైమందిపై చేసిన ప్రయోగంలో భాగంగా... కన్సోల్ గేమ్ ను 50 నిమిషాల పాటు ఆడమన్నారు. అలా అడిన వారందరూ ఆపిన వెంటనే నీరసంగా ఫీలయ్యారు. అందులో సగంకంటే ఎక్కువ మంది.. ముఖ్యంగా పిల్లల్లో  56 శాతంమంది కడుపులో తిప్పినట్లుగా ఉందన్నారు. అలాగే మిన్నెసోటా విశ్వవిద్యాలయంలో చేపట్టిన మరో అధ్యయనంలో గేమ్ కన్సోల్ సిక్నెస్ పురుషుల్లో కంటే, మహిళల్లో ఎక్కువశాతం ఉంటుందని, ఇదికూడ సైబర్ సిక్నెస్ వంటిదేనని తేల్చారు.  ఇటువంటి లక్షణాలవల్ల చాలామంది ఆన్ లైన్లో పేపర్ చదవడం, స్కైప్ లో మాట్లాడటం కూడ చేయలేకపోతున్నారు. అలాగే ల్యాప్ టాప్ లో స్క్రీన్ కదిపినా, ఫ్లాష్ చేసినా కూడ తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు.

టెక్నాలజీ ఇండస్ల్రీ ఇటువంటి సమస్యలను గత ముఫ్ఫై ఏళ్ళుగా ఎదుర్కొంటోందని.. కావెంట్రీ విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ మొబిలిటీ అండ్ ట్రాన్స్ పో్ర్ట్ సీనియర్ లెక్చరర్ డాక్టర్ సైరియల్ డైల్స్ అంటున్నారు. వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ వాడకంవల్ల మోషన్ సిక్నెస్ వస్తోందని, కొందరు అతి సున్నితత్వంవల్ల కూడ ఈ సమస్య ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన తెలిపారు. కంప్యూటర్ స్క్రీన్ చూడ్డం వల్ల వచ్చిన సమస్యతో  కొందరు ఉద్యోగాలు కూడ చేయలేకపోతున్నారని సైరియల్ చెప్తున్నారు.

అలాగే కొన్నాళ్ళక్రితం తాను తీవ్ర మైగ్రేన్ తో బాధపడ్డానని అది ఫోన్ వల్ల వస్తోందని గమనించానని, ఇప్పుడు గర్భంతో ఉన్న తనకు కనీసం కంప్యూటర్ స్క్రీన్ దూరంనుంచీ చూస్తే కూడా వాంతి వస్తోందని అంటోంది మరో మహిళ. ఇటువంటి లక్షణాలన్నీకనుగుడ్లు ఎక్కువగా తిప్పడంవల్ల మెదడు కదలికలకు భంగం కలుగుతుందని, దాని కారణంగానే కళ్ళు తిరిగినట్లుగా, వాంతి వచ్చినట్లుగా ఉంటుందని లండన్ కంటి ఆసుపత్రిలోని ఆప్తమాలజిస్ట్ బాబీ క్వెషి చెప్తున్నారు. ప్రతి ఇరవై నిమిషాలకు ఒకసారి కళ్ళు మూసుకొని, స్క్రీన్ చూడటానికి బ్రేక్ ఇవ్వాలని, అంతేకాక కాస్త దూరం నుంచి చూసే అలవాటు చేసుకోవడంవల్ల కొంత శ్రమ తగ్గుతుందని ఆమె చెప్తున్నారు. వీలైంతవరకూ ఎక్కువ సమయం ఐపాడ్స్, ఫోన్లు చూడడం మానుకోగల్గితే సైబర్ సిక్నెస్ కు దూరంగా ఉండొచ్చని ఆమె సలహా ఇస్తున్నారు.

మరిన్ని వార్తలు