ఎవరెస్ట్‌పై ట్రాఫిక్‌ జామ్‌.. ఇద్దరి మృతి

25 May, 2019 08:02 IST|Sakshi

కఠ్మాండు: ఎవరెస్ట్‌ పర్వతంపై ట్రాఫిక్‌ ఏంటని ఆలోచిస్తున్నారా? మీరు చదివింది నిజమే..! ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన పర్వతం మౌంట్‌ ఎవరెస్ట్‌ అనే విషయం మీలో చాలా మందికి తెలిసిందే. ఈ పర్వతాన్ని అధిరోహించడానికి ఎంతోమంది పర్వతారోహకులు ఆసక్తి చూపిస్తూంటారు. అయితే తాజాగా వివిధ దేశాలకు చెందిన 200 మంది పర్వతారోహకులు ఒకేసారి మౌంట్‌ ఎవరెస్ట్‌ ఎక్కడానికి ప్రయత్నించారు. ఒకేసారి వందల సంఖ్యలో ట్రెక్కర్స్‌ రావడంతో.. పర్వత శిఖరానికి చేరుకునేమార్గంలో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. దీంతో గంటలపాటు ముందుకు వెళ్లలేక, వెనక్కు వెళ్లలేక క్యూలో వేచి ఉన్నారు. ఈ విషయాన్ని పర్యాటకశాఖకు చెందిన అధికారి జ్ఞానేంద్ర శ్రేష్ఠ తెలిపారు. వసంత రుతువు కావడంతో ప్రభుత్వం 381 మందికి పర్వతాన్ని అధిరోహించడానికి అనుమతి ఇచ్చింది. ఈ కారణంగానే వందలాది మంది ఒకేసారి పర్వతంపైకి చేరుకోడానికి ఆసక్తి కనబర్చారు. ప్రతి ఏడాది మార్చి నుంచి జూన్‌ వరకు మౌంట్‌ ఎవరెస్ట్‌ను అధిరోహించే వారి సంఖ్య వందల్లో ఉండటం విశేషం. ఇదిలా ఉంటే... 1953 నుంచి ఇప్పటివరకు 4,400 మందికిపైగా మౌంట్‌ ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించారు.

ఇద్దరి భారతీయుల మృతి
ఓవైపు ట్రాఫిక్‌ జామ్ ఎక్కువవగా... దురదృష్టం కొద్దీ అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మంచుతో కూడిన గాలులు ప్రాణాలు తీస్తున్నాయి. శిఖరాన్ని అధిరోహించి గురువారం మధ్యాహ్నం తిరిగి కిందకి వస్తున్న భారతీయ మహిళ కల్పనా దాస్‌(52) అనే చనిపోయారు. మరో భారతీయుడు నిహాల్‌ భగవాన్‌(27) కూడా అదే విధంగా మృతిచెందారు. ఆయన కిందకి వస్తున్నప్పుడు దాదాపు 12 గంటల పాటూ ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. చివరకు చనిపోయారు.

మరిన్ని వార్తలు