మోదీ ట్విటర్‌ ఆన్‌ఫాలో.. వైట్‌హౌస్‌ వివరణ

30 Apr, 2020 09:23 IST|Sakshi

వాషింగ్టన్‌ : కొన్ని వారాలుగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్‌ ఖాతాను ఫాలో అయిన వైట్‌హౌస్‌ తాజాగా ఆయనను ఆన్‌ఫాలో చేసిన సంగతి తెలిసిందే. ఇది కాస్త భారత్‌లో చర్చనీయాంశంగా మారింది. అమెరికా–భారత్‌ల మధ్య దెబ్బతిన్న బంధాలకు ఇదొక నిదర్శనమని పలువురు వ్యాఖ్యానించారు. అయితే ఇందుకు సంబంధించి బుధవారం వైట్‌హౌస్‌ వర్గాలు వివరణ ఇచ్చాయి. అమెరికా అధ్యక్షుడు పర్యటించే దేశాలకు చెందిన దేశాధినేతల అధికారిక ట్విటర్‌ ఖాతాలను వైట్‌హౌస్‌ అనుసరించడం సాధారణంగా జరుగుతుంటుందని తెలిపాయి. అధ్యక్షుడి పర్యటనకు మద్దతుగా.. వారి ట్విట్స్‌ను రీట్విట్‌ చేసేందుకు కొద్దికాలం పాటు మాత్రమే ఆ ఖాతాలను ఫాలో అవనున్నట్టు వెల్లడించాయి.

‘వైట్‌ హౌస్‌ ట్విటర్‌లో అమెరికా ప్రభుత్వ సీనియర్‌ ట్విటర్‌ అకౌంట్స్‌ అనుసరిస్తుంది. అధ్యక్షుడి విదేశీ పర్యటన సమయంలో మాత్రమే అందుకు.. అతిథ్య దేశానికి సంబంధించిన అకౌంట్‌లను కొద్దికాలం ఫాలో అవుతుంది’ అని వైట్‌హౌస్‌కు చెందిన ఓ సీనియర్‌ అధికారి తెలిపారు. కాగా, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఫిబ్రవరి చివరి వారంలో ఇండియా పర్యటనకు వచ్చిన సమయంలో వైట్‌హౌస్‌ అధికార ట్విటర్‌ అకౌంట్‌.. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ, భారత ప్రధాని కార్యాలయం, అమెరికాలోని భారత దౌత్య కార్యాలయం, ఇండియాలోని అమెరికా దౌత్య కార్యాలయం, భారత్‌లో అమెరికా రాయబారి ట్విటర్‌ ఖాతాలను అనుసరించడం మొదలుపెట్టింది. అయితే ఈ వారంలో ఆ ఆరు ఖాతాలను వైట్‌హౌస్‌ ట్విటర్‌లో ఆన్‌ఫాలో చేసింది. దీంతో వైట్‌హౌస్‌ ట్విటర్‌ లో అనుసరిస్తున్న ఖాతాల సంఖ్య 13కు తగ్గింది.

చదవండి : మోదీ ట్విట్టర్‌తో అమెరికా కటీఫ్‌

మరిన్ని వార్తలు