ద్విచక్ర వాహనాలు ఢీ

14 Feb, 2018 16:00 IST|Sakshi
చికిత్స పొందుతున్న సంతోష్‌ 

యువకుడి మృతి

ముగ్గురికి తీవ్ర గాయాలు

కారేపల్లి : రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో నలుగురికి తీవ్రగాయాలు అయిన ఘటన కారేపల్లి పెట్రోల్‌ బంక్‌ సమీపంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉసిరికాయలపల్లి గ్రామానికి చెందిన బాణోతు సంతోష్‌ పెట్రోల్‌ బంక్‌ పక్కనే భవన నిర్మాణ పనులను సూపర్‌వైజింగ్‌ చేస్తున్నాడు. కామేపల్లి గ్రామానికి చెందిన తేజావత్‌ రాము, దుబ్బతండా గ్రామానికి చెందిన తమ బంధువులు మౌనిక, అచ్చమ్మను ద్విచక్రవాహనంపై తీసుకొని కారేపల్లి వైపు వస్తున్నాడు.

ఇదే క్రమంలో ఖమ్మం–కారేపల్లి ప్రధాన రహదారి పెట్రోల్‌ బంక్‌ సమీపంలో రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో బాణోతు సంతోష్, తేజావత్‌ రాములు, మౌనిక, అచ్చమ్మలకు తీవ్రగాయాలు అయ్యాయి. వారిని స్థానిక యువకులు ఆటోలో కారేపల్లి పీహెచ్‌సీకి తరలించారు. కాగా, వారిలో బాణోతు సంతోష్‌ తలకు తీవ్రగాయాలు కావటంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. 108 అంబులెన్స్‌కు ఫోన్‌ చేసినా.. ఎంతకు రాకపోవటంతో స్థానికులు కారులో ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సంతోష్‌(22) మృతి చెందాడు.  

మరిన్ని వార్తలు