ఖమ్మం సహకారనగర్: ఓటర్ల తుది జాబితాను ఈనెల 10న విడుదల చేయగా ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల్లో కలిపి 21,83,235 మంది ఓటర్లు ఉన్నట్లు తేలింది. అయితే, అధికారులు మంగళవారం వయసుల వారీగా సైతం ఓటర్ల వివరాలు వెల్లడించారు. కాగా, అన్ని నియోజకవర్గాల్లో కలిపి 30నుంచి 39 ఏళ్ల వయసు ఓటర్లు అత్యధికంగా ఉన్నట్లు జాబితా ద్వారా తెలిసింది. ఈ కేటగిరీలో 6,11,935 మంది ఓటర్లు ఉండగా.. అతి తక్కువగా 80ఏళ్ల వయసు పైబడిన వారు 29,888 మంది ఉన్నారు. కాగా, మొత్తం ఓటర్లలో 18 నుంచి 39ఏళ్ల లోపు వయసు ఓటర్లు 11,20,279 మంది ఉండడంతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటముల్లో వీరే కీలకపాత్ర పోషించే అవకాశముందని భావిస్తున్నారు.