‘ఆటోనగర్ సూర్య’దీపావళికి వస్తున్నాడు

30 Aug, 2013 00:51 IST|Sakshi
‘ఆటోనగర్ సూర్య’దీపావళికి వస్తున్నాడు
‘ఆటోనగర్ సూర్య’ హంగామా చేయడానికి సన్నద్ధమవుతున్నాడు. బ్యాలెన్స్ వర్క్‌ని పూర్తి చేసి, దీపావళికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ‘ఏమాయ చేసావె’ తర్వాత నాగచైతన్య, సమంత కలిసి చేస్తున్న సినిమా ఇది. 
 
 ‘వెన్నెల’, ‘ప్రస్థానం’ చిత్రాలతో దర్శకునిగా తనకంటూ ఓ ప్రత్యేకతను సొంతం చేసుకున్న దేవా కట్టా ఈ మాస్ చిత్రాన్ని క్లాస్‌గా డీల్ చేస్తున్నారు. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సమర్పణలో మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై కె.అచ్చిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబరు 10న చివరి షెడ్యూలు మొదలుకానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘ఈ షెడ్యూల్‌లో ఒక పాట, రెండు రోజుల ప్యాచ్‌వర్క్ పూర్తి చేస్తాం.
 
 ఆ తర్వాత మలేసియాలో పాట చిత్రీకరిస్తాం. దాంతో సినిమా పూర్తవుతుంది. మరోపక్క నిర్మాణానంతర కార్యక్రమాలు మొదలుపెట్టాం’’ అని తెలిపారు. బ్రహ్మానందం, సాయికుమార్, జయప్రకాష్‌రెడ్డి, ఎమ్మెస్ నారాయణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: శ్రీకాంత్ నారోజ్.