బ్రేకప్ గురించి చెబుతూ బోరుమన్న నటి!

5 May, 2018 15:42 IST|Sakshi
కన్నీళ్లు పెట్టుకున్న దివ్యాంక.. పక్కన భర్త వివేక్‌తో

ముంబై: గత ప్రేమ జ్ఞాపకాలు గుర్తు చేసేసరికి నటి దివ్యాంక త్రిపాఠి కన్నీళ్లు పెట్టుకున్నారు. గతంలో సాగించిన ప్రేమాయణం తన జీవితంలో చీకటి కోణమంటూ ఆమె వ్యాఖ్యానిస్తూ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ఇందుకు సంబంధించిన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఆమె పోస్ట్ చేసిన ప్రోమో వీడియో వైరల్ అవుతోంది. రాజీవ్ ఖండేల్‌వాల్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాక్ షో ‘జజ్ బాత్‌’లో నటి దివ్యాంక పాల్గొన్నారు. కొన్ని ప్రశ్నలు అడిగిన తర్వాత మీ గుండె ఎప్పుడైనా బద్దలైనట్లు అనిపించిందా, ఎక్కువగా బాధపడ్డ సందర్భం ఏంటని రాజీవ్ ఆమెను అడిగారు. ఇక అంతే నటి ఉద్వేగానికి లోనై ఏడ్చేశారు.

గతంలో టీవీ నటుడు శరద్ మల్హోత్రా, నటి దివ్యాంక త్రిపాఠిలు గాఢంగా ప్రేమించుకున్నారు. దాదాపు ఎనిమిదేళ్లు ప్రేమాయణం తర్వాత వీరు బ్రేకప్ అయ్యారు. ఈ విషయాన్ని నటి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ‘ఎనిమిదేళ్లు ముగుస్తున్న సమయంలో నా జీవితం ముగిసి పోతుందనుకున్నా. ఏది నమ్మోలో.. వద్దో తెలియని స్థితి ఎదురైందంటూ’  దివ్యాంక చెబుతూ భావోద్వేగానికి లోనయ్యారు.  టాక్‌ షోలో దివ్యాంక భర్త వివేక్‌ దహియాతో పాల్గొని సందడి చేశారు.

2015లో శరద్‌తో బ్రేకప్ అయ్యాక ఆమె వివేక్‌ దహియాను వివాహం చేసుకున్నారు. గత రెండేళ్లుగా వీరు ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. వీరి అభిమానులు ముద్దుగా ఈ జోడీని ‘దివేక్’అని పిలుచుకోవడం తెలిసిందే. పలు హిందీ సీరియళ్లు, టీవీ షోలతో దివ్యాంక త్రిపాఠి పాపులర్‌ అయ్యారు. ఆమె తొలి సీరియల్‌ 'మే తేరి దుల్హాన్‌' హిట్‌ కావడం పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది. డ్యాన్స్‌ షో 'నాచ్‌ బాలియే'లో పాల్గొని విజేతగా నిలిచిన దివ్యాంక.. త్వరలో బాలీవుడ్‌లో అడుగుపెట్టాలని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు