సాక్షి, టీ.నగర్: కార్పొరేషన్, మున్సిపాలిటీ పరిధిలోని థియేటర్లలో విడుదలయ్యే కొత్త చిత్రాలకు 30 శాతం వినోదపు పన్ను విధించాలని అసెంబ్లీలో గురువారం మంత్రి ఎస్పీ వేలుమణి ఓ చట్ట సవరణ ముసాయిదాను దాఖలు చేశారు. అందులో తమిళనాడు చలనచిత్ర ప్రతినిధులు, స్థానిక సంస్థలకు వినోదపు పన్ను విధించడంపై ఉన్న వివాదాలను పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారన్నారు. ఈ వ్యవహారంపై నియమించిన ప్రతినిధులతో కూడిన ఒక ఉన్నతస్థాయి కమిటీ సిఫార్సులను ప్రభుత్వానికి సమర్పించిందన్నారు.
పరిశీలించిన ప్రభుత్వం వినోదపు పన్ను వసూలు చేసేందుకు స్థానిక సంస్థల ద్వారా నియమితులైన అధికారులు పరిశీలన జరిపేలా అనుమతిచ్చే చట్ట ముసాయిదా దాఖలు చేశామన్నారు. ఈ మేరకు కార్పొరేషన్, పట్టణ పంచాయతీ పరిధి లోని థియేటర్లలో 30 శాతం వినోదపు పన్ను చెల్లించాలని, పాత చిత్రాలకు 20 శాతం వినోదపు పన్ను చెల్లించాలని అందులో పేర్కొన్నారు.