హోమానంద్, పావని జంటగా నటించిన చిత్రం ‘మిస్టర్ హోమానంద్’. జైరామ్ కుమార్ దర్శకుడు. ఓం తీర్థం ఫిల్మ్ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఈ నెల 29న సినిమా విడుదల కానుంది. హోమానంద్ మాట్లాడుతూ – ‘‘మా నాన్న పేరు కేశవ తీర్థ. ఈ సినిమాకి నిర్మాత ఆయనే. మా బ్యానర్లో ‘బెజవాడ పోలీస్ స్టేషన్’తో పాటు మరో సినిమా చేశారు. ఆయన స్ఫూర్తితోనే నేను సినిమాల్లోకొచ్చాను. బీబీఏ డిగ్రీ పూర్తి చేశాను. మొదట షార్ట్ ఫిల్మ్స్లో నటించాలనుకున్నాను. అనుకోకుండా సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది.
సత్యంగారి దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాను. ఆయన దగ్గర నేర్చుకున్న మెళకువలు సెట్స్లో బాగా ఉపమోగపడ్డాయి. సినిమా కథ విషయానికొస్తే.. నాది పిసినారి పాత్ర. కూడబెట్టుకున్న డబ్బుతో ఓ ఇల్లు కొంటాను. ఆ ఇంట్లో దెయ్యం ఉంటుంది. ఎంతో కష్టపడి కొనుక్కున్న ఇంట్లో దెయ్యం ఏంటి? దెయ్యమో, నేనో తేల్చుకోవాలి. సింపుల్గా సినిమా కథ ఇది. హారర్ కామెడీతో సినిమా అంతా నవ్విస్తుంది. దర్శకుడు జైరామ్ నాకు చిన్నప్పటి నుండి తెలుసు. ఆయన కథ చెప్తున్నప్పుడే నాకు, నా ఫ్యామిలీకి నచ్చింది. సినిమా చూసిన ప్రేక్షకులందరికీ తప్పకుండా నచ్చుతుంది. రాజా వన్నెంరెడ్డిగారితో ఓ సినిమా చేయబోతున్నాను. దర్శకులు సుకుమార్, మారుతీల ప్రొడక్షన్స్లో నటించేందుకు డిస్కషన్స్ జరుగుతున్నాయి’’ అన్నారు.