హీరోయిన్‌ కోసం బాయ్‌ఫ్రెండ్స్‌ ఫైట్‌

18 Mar, 2019 09:42 IST|Sakshi

ఓ హోటల్లో కొట్టుకున్న వైనం

బనశంకరి : హీరోయిన్‌ రాగిణి ద్వివేది కోసం ఆమె ఇద్దరు స్నేహితులు పరస్పరం దాడి చేసుకున్న ఘటన ఆదివారం వెలుగు చూసింది. శుక్రవారం రాత్రి నగరంలోని రిట్జ్‌ కార్టన్‌ హోటల్‌కు హీరోయిన్‌ రాగిణి ఆర్టీఓ శాఖలో అధికారిగా పని చేస్తున్న రవి అనే వ్యక్తితో కలసి వెళ్లారు. అదే సమయంలో అదే హోటల్‌లో రాగిణి మాజీ స్నేహితుడు, వ్యాపారి శివప్రకాశ్‌ స్నేహితులతో కలసి పార్టీ చేసుకుంటున్నాడు. కాగా తమ మధ్య తలెత్తిన మనస్పర్థలతో తనను వదిలేసిందనే కారణంగా రాగిణిపై ద్వేషం పెంచుకున్న శివప్రకాశ్, రాగిణి అదే హోటల్‌కు రవితో రావడాన్ని చూసి కోపాన్ని అదుపు చేసుకోలేక రాగిణితో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో రవి, శివప్రకాశ్‌ల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. ఇరువురి మధ్య వాగ్వాదం శృతి మించడంతో శివప్రకాశ్‌ బీర్‌ బాటిల్‌తో రవిపై దాడి చేశాడు. గమనించిన హోటల్‌ సిబ్బంది ఇరువురిని విడిపించడంతో గొడవ సద్దుమణిగింది. గొడవపై రాగిణి, రవిలు అశోకనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోసారి తనకు కనపడితే చంపేస్తానంటూ శివప్రకాశ్‌ బెదిరించాడంటూ రవి ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హోటల్‌లో సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించి  శివప్రకాశ్‌ను అరెస్ట్‌ చేశారు. 

వెలుగు చూసిన కొత్తకోణం.. 
కాగా హోటల్‌కు వెళ్లే సమయంలో రవి భార్య రవికి ఫోన్‌ చేసి రాగిణితో తిరుగుతుండడంపై గొడవ పడినట్లు తెలుస్తోంది. ‘నువ్వు రాగిణితో తిరుగుతున్నావనే విషయం నాకు తెలిసిపోయింది రాగిణి కోసం నా జీవితాన్ని నాశనం చేశావు. నిన్ను ఏంచేసినా నీకు బుద్ధి రాదు. ఇప్పుడు రాగిణితో కలసి ఎక్కడున్నావనే విషయం కూడా తెలుసు. చూస్తుండు ఎవరో ఒకరు వచ్చి నిన్ను కసితీరా కొడతారు. నిన్ను ఊరికే వదిలేసే ప్రసక్తే లేదు. నువ్వు ఉన్న చోటుకే వచ్చి నిన్నుకొట్టి మరీ బుద్ధి చెబుతార’ంటూ రవి భార్య రవిని బెదిరించినట్లు తెలుస్తోంది. ఇది జరిగిన కొద్ది సేపటికే రవిపై హోటల్‌లో రాగిణి మాజీ స్నేహితుడు శివప్రకాశ్‌ బాటిల్‌తో దాడి చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది.  

>
మరిన్ని వార్తలు