సల్మాన్ ఖాన్ నిర్దోషి

6 May, 2015 10:53 IST|Sakshi

ముంబై: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్కు కోర్టులో విముక్తి లభించింది. సుదీర్ఘ విచారణానంతరం హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ఖాన్ (49) నిర్దోషిగా బయటపడ్డారు. బుధవారం ఉదయం ముంబై సెషన్స్ కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. సల్మాన్ నేరం చేసినట్టు ఆధారాలులేనందున, ఈ కేసు నుంచి అతనికి విముక్తి కల్పిస్తున్నట్టు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి డీడబ్ల్యూ దేశ్‌పాండే ప్రకటించారు. అభిమానులు, సినీ పరిశ్రమ ఆసక్తిగా ఎదురు చూసిన తీర్పు.. సల్మాన్కు అనుకూలంగా వచ్చింది. దీంతో సల్మాన్, కుటుంబ సభ్యులు, బాలీవుడ్ పరిశ్రమ ఊపిరి పీల్చుకుంది.

2002 సెప్టెంబర్ 28 అర్ధరాత్రి ముంబైలోని బాంద్రా ప్రాంతంలో సల్మాన్ మద్యం మత్తులో కారు నడిపడంతో పేవ్‌మెంట్‌పై పడుకున్న వారిపై వాహనం దూసుకెళ్లినట్టు కేసు నమోదైంది. ఈ ప్రమాదంలో నూరుల్లా మెహబూబ్ షరీఫ్ అనే వ్యక్తి చనిపోగా, మరో నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. తొలుత బాంద్రా మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఈ కేసును విచారించింది.  అనంతరం విచారణను సెషన్స్ కోర్టుకు బదిలీ చేసింది. దాదాపు 13 ఏళ్ల పాటు సాగిన ఈ కేసు విచారణలో పలువురిని ప్రశ్నించి, సాక్ష్యాలు నమోదు చేశారు. చివరకు సల్మాన్ నిర్దోషిగా బయటపడ్డారు.

ఈ రోజు ఉదయం సల్మాన్ ఖాన్ బాంద్రాలోని తన నివాసం నుంచి కుటుంబ సభ్యులతో కలసి ముంబై సెషన్స్ కోర్టుకు వెళ్లారు. కోర్టు ఆవరణలో భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. లాయర్లు, మీడియా, కోర్టు సిబ్బందిని మాత్రమే లోపలికి అనుమతించారు.  న్యాయమూర్తి సల్మాన్ను నిర్దోషిగా ప్రకటించగానే అతనితో పాటు కుటుంబ సభ్యుల ముఖంలో సంతోషం కనిపించింది. బాలీవుడ్ నిర్మాతలకు కష్టాలు తప్పాయి. సల్మాన్ హీరోగా పలు సినిమాలు నిర్మితమవుతున్నాయి. రూ. 200 కోట్ల ప్రాజెక్టులు ఆయనపై ఆధారపడి ఉన్నాయి. సల్మాన్కు శిక్ష పడినట్టయితే ఈ ప్రాజెక్టుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారేది.