ప్రముఖ టీవీ నటిపై మరదలి వేధింపుల కేసు

31 Dec, 2015 19:07 IST|Sakshi
ప్రముఖ టీవీ నటిపై మరదలి వేధింపుల కేసు

ప్రముఖ టీవీ నటి స్మితా బన్సల్‌కు కొత్త సంవత్సరం వేధింపుల కేసుతో ప్రారంభమైంది. ఆమె తనను వేధించిందంటూ మరదలు మేఘాగుప్తా కేసు పెట్టింది. స్మితా బన్సల్ తన అభరణాలు, రూ. 50 లక్షలు సైతం చోరీచేసిందని ఆమె ఆరోపించింది. అయితే  తనను ఈ కేసులోకి అనవసరంగా లాగుతున్నారని స్మితా బన్సల్ చెప్తోంది.

స్మితా బన్సల్‌పై సెక్షన్ 498 (ఏ) కింద గుర్గావ్‌లోని మహిళా ఠాణాలో కేసు నమోదైంది. 'ఏం చెప్పాలో నాకు తెలియడం లేదు. ఎఫ్‌ఐఆర్ కాపీ కూడా నా దగ్గర లేదు. ఎఫ్‌ఐఆర్‌ నాకు అందిన తర్వాత నాపై మోపిన అభియోగాలేమిటో తెలుసుకొని నేను స్పందిస్తాను. నన్ను ఎందుకు ఈ కేసులోకి లాగారో అర్థం కావడం లేదు' అని స్మితా బన్సల్‌ తెలిపింది. 'అమానత్', 'ఆశిర్వాద్' వంటి ప్రముఖ హిందీ సీరియళ్లలో నటించిన స్మితా బన్సల్ సోదరుడు సౌరభ్ బన్సల్‌ 2009లో మేఘా గుప్తాను పెళ్లాడారు.

ఆ తర్వాత దంపతులు లండన్‌ వెళ్లిపోయారు. దంపతుల మధ్య గొడవలు రావడంతో ఈ ఏడాది ప్రారంభంలో మేఘా గుప్తా గుర్గావ్‌ తిరిగొచ్చేసింది. మేఘా గుప్తాతో తనకు పెద్దగా సంబంధాలు లేవని, ఆమెతో ఎప్పుడూ గడిపింది కూడా లేదని, పెళ్లికాగానే తన సోదరుడు, మరదలు లండన్ వెళ్లిపోయారని స్మితా బన్సల్ వివరించారు.