50 కోట్లు దాటిన 'శ్రీమంతుడు'

10 Aug, 2015 11:40 IST|Sakshi
50 కోట్లు దాటిన 'శ్రీమంతుడు'

చెన్నై: సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన తెలుగు బ్లాక్ బస్టర్ మూవీ శ్రీమంతుడు రూ.50 కోట్లు దాటింది. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం వారం ప్రారంభంలోనే రూ.50 కోట్లు వసూళ్లను రాబట్టడంతో తెలుగు చిత్ర సీమకు మరింత ఉత్సాహాన్నిచ్చినట్లయింది. కాగా, ఈ చిత్రం విడుదలైన రోజే రూ.31కోట్లు సాధించిందని చిత్ర వర్గాలు తెలిపాయి.

మరోపక్క, అమెరికాలో కూడా విడుదలైన ఈ చిత్రం సోమవారం రెండు మిలియన్ డాలర్లను దాటనుందట. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శృతిహాసన్, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్ వంటి ప్రముఖ నటులు ఉన్నారు. కోటీశ్వరుడైన ఓ యువకుడు ఊరిని దత్తత తీసుకునే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే.