తర్వాతి చిత్రం మహేశ్‌తోనే.. జక్కన్న క్లారిటీ

18 Apr, 2020 13:33 IST|Sakshi

రౌద్రం రణం రుధిరం(ఆర్‌ఆర్‌ఆర్‌) తర్వాత తన తదుపరి చిత్రం టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబుతో ఉంటుందని దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి స్పష్టం చేశారు. నిర్మాత కేఎల్‌ నారాయణ, మహేశ్‌, తన కాంబినేషన్‌లో ఓ సినిమా ఉంటుందని ఎప్పట్నుంచో చెబుతున్నానని, డీవీవీ దానయ్య చిత్రం తర్వాత ఆ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కుతుందని అన్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత జక్కన్న ప్రభాస్‌తో మరో చిత్రం లేక ఈగ సీక్వెల్‌ చేస్తాడని సోషల్‌ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తదుపరి చిత్రం గురించి స్పష్టతనివ్వడంతో రూమర్స్‌కు చెక్‌ పడింది.  

ఇక రాజమౌళి-మహేశ్‌ సినిమా కోసం సినీ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.  అయితే ఈ కాంబినేషన్‌లో ఓ సినిమా ఉంటుందని అనధికారికంగా తెలిసినా.. ఇప్పటివరకు వీరిద్దరి నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో ఈ సినిమాపై అనుమానాలు రేకెత్తాయి. అయితే ఆ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ మహేశ్‌ సినిమాపై దర్శకధీరుడు స్పష్టతనిచ్చాడు. ఈ సినిమాపై జక్కన్న తొలిసారి స్పందించడంతో మహేశ్‌ ఫ్యాన్స్‌ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అంతేకాకుండా మహేశ్‌ కోసం జక్కన్న ఏ కథను సిద్దం చేస్తున్నాడనే ఆసక్తిని కూడా కనబరుస్తున్నారు. 

ఇక ప్రస్తుతం మెగాపవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌లు హీరోలుగా భారీ మల్టీస్టా​రర్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ను రాజమౌళి తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. చరణ్‌ బర్త్‌డే సందర్భంగా ‘భీమ్‌ ఫర్‌ రామరాజు’ పేరుతో విడుదలైన ప్రత్యేక వీడియోతో సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రేక్షకులకు అర్థమైపోయింది. ఇక మే 20న ఎన్టీఆర్‌ బర్త్‌డే సందర్భంగా మరొ సర్‌ప్రైజ్‌ ఉంటుందని ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా కీరవాణి సంగీతమందిస్తున్నాడు. మరోవైపు పరుశురామ్‌ దర్శకత్వంలో ఓ సినిమాను ప్లాన్‌ చేస్తున్నారు సూపర్‌స్టార్‌. ఈ సినిమాను వచ్చే సంక్రాంతి విడుదల చేయాలని భావిస్తున్నారు.

చదవండి: 
సుధీర్‌ డ్యాన్స్‌ స్టెప్పులకు టైగర్‌ ఫిదా
10 కోట్ల వ్యూస్‌.. సంబరంలో మహేశ్‌ ఫ్యాన్స్

>
మరిన్ని వార్తలు