రెండు... మూడేళ్లే అయినట్టుంది!

7 Jan, 2017 00:19 IST|Sakshi
రెండు... మూడేళ్లే అయినట్టుంది!

‘‘ఓ నిర్మాతగా సినిమాలోని కథకు న్యాయం చేస్తూ, కథను కథగా తీయాలని ప్రయత్నిస్తుంటాను. ఇప్పుడీ ‘వైశాఖం’ కూడా కథే మెయిన్‌ హీరోగా నడిచే సినిమా. మా సంస్థ నిర్మించిన చిత్రాలన్నిటిలోనూ ఉత్తమ చిత్రంగా నిలుస్తుంది’’ అన్నారు బీఏ రాజు. హరీశ్, అవంతిక జంటగా బి. జయ దర్శకత్వంలో ఆర్‌.జె. సినిమాస్‌ పతాకంపై ఆయన నిర్మించిన సినిమా ‘వైశాఖం’. నేడు నిర్మాత బీఏ రాజు పుట్టినరోజు. ఆయన మట్లాడుతూ – ‘‘విలేకరిగా ప్రయాణం ప్రారంభించి, పీఆర్వోగా, పత్రికాధినేతగా, నిర్మాతగా చిత్ర పరిశ్రమలో నాకంటూ ఓ స్థానం ఏర్పరుచుకున్నాను.

నా విజయం వెనుక నా సతీమణి బి. జయ మద్దతు ఎంతో ఉంది. ఇన్నేళ్లుగా పనిచేస్తున్నా కెరీర్‌ స్టార్ట్‌ చేసి రెండు మూడేళ్ళే అయినట్టుంది. ప్రతిరోజూ చేసే పనిని ఇష్టంగా చేయడం నా పాలసీ. ‘వైశాఖం’ చిత్రానికి వస్తే ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకూ మా సంస్థ నిర్మించిన సినిమాలు బయ్యర్లకు లాభాలు తీసుకురావడంతో ‘వైశాఖం’ బిజినెస్‌ బాగా జరిగింది. ఈ సినిమా విడుదలకు ముందే మరో సినిమా ప్రారంభిస్తా’’ అన్నారు.