నాకు స్ఫూర్తి ఆ ఇద్దరే – వెంకీ కుడుముల

30 Jan, 2018 00:49 IST|Sakshi
దర్శకుడు వెంకీ కుడుముల

‘‘నాది ఖమ్మం జిల్లా అశ్వరావుపేట. సినిమాలపై ఆసక్తితో రచయిత బలభద్రపాత్రుని రమణి ద్వారా తేజ గారి వద్ద ‘నీకు నాకు డాష్‌ డాష్‌’ సినిమాకి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేరా. ఆ తర్వాత ‘అ ఆ’ సినిమాకు త్రివిక్రమ్‌గారి వద్ద దర్శకత్వ శాఖలో పనిచేశా. దర్శకులు త్రివిక్రమ్, పూరి జగన్నాథ్‌ నాకు స్ఫూర్తి’’ అన్నారు దర్శకుడు వెంకీ కుడుముల. నాగశౌర్య, రష్మిక మండన్న జంటగా శంకర్‌ ప్రసాద్‌ మూల్పూరి సమర్పణలో ఉషా మూల్పూరి నిర్మించిన ‘ఛలో’ ఫిబ్రవరి 2న విడుదలవుతోంది.

ఈ సందర ్భంగా దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ –‘‘నాగశౌర్య ‘జాదూగాడు’ సినిమాకు నేను డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసా. నా వర్క్‌ నచ్చడంతో కథ రెడీ చేసుకురమ్మన్నారు శౌర్య. నేను వినిపించిన ‘ఛలో’ స్టోరీ ఆయనకు నచ్చడంతో సినిమా ప్రారంభమయ్యింది. నన్ను, నా కథను నమ్మి నాగశౌర్య పేరెంట్స్‌ ఈ సినిమా నిర్మించినందుకు వారికి నా కృతజ్ఞతలు. కన్నడ ‘కిరిక్‌ పార్టీ’ సినిమా చూశాక రష్మిక హీరోయిన్‌గా కరెక్ట్‌ అనిపించింది.

నాగశౌర్యతో పాటు ఆయన పేరెంట్స్‌ కూడా ఓకే అనడంతో తనని తీసుకున్నాం. సంగీత దర్శకుడు సాగర్‌ మణిశర్మగారి అబ్బాయి అని అందరికీ తెలుసు. ‘జాదూగాడు’ టైమ్‌లో నాకు పరిచయమయ్యారు.  ‘ఛలో’ సినిమాకు మంచి పాటలిచ్చారు. ఇప్పటి యువ దర్శకులపై త్రివిక్రమ్‌గారి ప్రభావం ఉంటుంది. అయితే ఆయన్ని అనుకరించకూడదు. సినిమా అవుట్‌పుట్‌ చూశాక టెన్షన్‌ లేదు. ‘ఛలో’ రిలీజ్‌ తర్వాత కొత్త సినిమా స్క్రిప్ట్‌ పనులు ప్రారంభిస్తా’’ అన్నారు.

మరిన్ని వార్తలు