‘చండీ’ పాటల వేడుకకు విద్యాబాలన్

31 Jul, 2013 00:47 IST|Sakshi
‘చండీ’ పాటల వేడుకకు విద్యాబాలన్
తెలుగుతెరపై ఎప్పుడు సాక్షాత్కరిస్తుందా? అని అందరూ ఎదురుచూస్తున్న బాలీవుడ్ భామ విద్యాబాలన్... త్వరలో మరో రూపంలో తెలుగు ప్రేక్షకులను కనువిందు చేయనున్నారు. ప్రియమణి ప్రధాన పాత్రలో రూపొందుతోన్న ‘చండి’ చిత్రం ఆడియో వేడుక ఆగస్ట్ 12న జరుగనుంది. ఈ వేడుకకు ఈ ‘డర్టీ పిక్చర్’ హీరోయిన్.. అతిథిగా రానున్నారు. విద్య అభిమానులకు ఇది నిజంగా శుభవార్తే. విద్యాబాలన్, ప్రియమణి ఇద్దరూ కజిన్స్ అన్న విషయం తెలిసిందే.
 
  వి.సముద్ర దర్శకత్వంలో డా.శ్రీనుబాబు.జి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఎస్.ఆర్.శంకర్, చిన్న సంయుక్తంగా స్వరాలందించిన ఈ చిత్రం పాటలను గ్రాండ్‌గా విడుదల చేయడానికి నిర్మాత శ్రీనుబాబు సన్నాహాలు చేస్తున్నారు. విద్యాబాలన్‌తో పాటు మరో అతిథిగా ప్రభాస్ కూడా ఈ వేడుకకు హాజరవ్వనున్నారు. ఈ సందర్భంగా సహ నిర్మాత సత్య ముమ్మడి మాట్లాడుతూ-‘‘ప్రియమణి కెరీర్‌లో చిరస్థాయిగా నిలిచిపోయే సినిమా ఇది.
 
  అశోక్‌గజపతిరాజుగా కృష్ణంరాజు పాత్ర ఈ చిత్రానికి హైలైట్. మరో శక్తిమంతమైన పాత్రలో తమిళ హీరో శరత్‌కుమార్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ దాదాపు పూర్తికావచ్చింది. సినిమా సాధించబోయే విజయానికి ప్రతీకగా ఆగస్ట్ 12న ఆడియో జరుపనున్నాం’’ అని తెలిపారు. ఆశిష్ విద్యార్థి, వినోద్‌కుమార్, నాగబాబు, అలీ, రంగనాథ్, పోసాని తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు: కరణం పి.బాబ్జీ, సమర్పణ: జి.జగన్నాథనాయుడు.
 
>