దేశ రాజధానిలో దారుణం

27 May, 2016 09:26 IST|Sakshi
దేశ రాజధానిలో దారుణం

న్యూఢిల్లీ: దేశరాజధానిలో అవమానవీయ ఘటన చోటుచేసుకుంది. పీకలదాకా మద్యం సేవించిన దుండగులు 16 ఏళ్ల బాలుడి పట్ల దారుణంగా ప్రవర్తించారు. ఢిల్లీలోని ఇందరపురిలో సోమవారం చోటుచేసుకున్న ఈ ఘటన బుధవారం వెలుగు చూసింది. ఈ కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

నిందితులు మద్యం మత్తులో బాలుడి బట్టలు విప్పించి దారుణంగా కొట్టారని డీసీపీ(నైరుతి) సురేందర్ కుమార్ తెలిపారు. అకారణంగా కొట్టినందుకు నిందితులపై కేసు నమోదు చేశామన్నారు. అయితే బాధితుడిపై ఎటువంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదని వైద్య పరీక్షల్లో తేలినట్టు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. బాలుడి కాళ్లుచేతులు కట్టేసి కొట్టినట్టు వీడియోలో కనబడుతోంది. అతడు కొట్టొద్దని వేడుకుంటున్నా వినకుండా హింసించారు. ఈ వీడియోను పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

అయితే బాలుడిపై లైంగిక దాడి జరిగిందని అతడి బంధువులు ఆరోపించారని, ఈ అవమానం తట్టుకోలేక అతడు ఆత్మహత్యకు ప్రయత్నించాడని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ ఆరోపణలను పోలీసులు తోసిపుచ్చారు.

మరిన్ని వార్తలు