దేశ రక్షణకు జవాన్ల కొరత..!

1 Aug, 2018 20:11 IST|Sakshi

9096 ​మంది అధికారుల కొరతను ఎదుర్కొంటున్న త్రివిధ దళాలు

లోక్‌సభలో వెల్లడించిన కేంద్ర మంత్రి

సాక్షి, న్యూఢిల్లీ : త్రివిధ దళాల్లో సైనికులు కొరతను తీవ్రంగా ఎదుర్కొంటున్నట్లు బుధవారం లోక్‌సభలో రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. మూడు విభాగాల్లో( రక్షణ, నావీ, ఎయిర్‌ఫోర్స్‌) కలిపి 9096 మంది అధికారుల కొరత ఉన్నట్లు రక్షణ శాఖ సహాయక మంత్రి సుభాష్‌ భోమ్రే  లోక్‌సభలో తెలిపారు. సభలో ఓ ప్రతిపక్ష సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఈ మేరకు రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. అత్యధికంగా రక్షణశాఖలో 7298 మంది సైనికుల కొరత ఉన్నట్లు వెల్లడించారు. నావీలో 1606, ఎయిర్‌ఫోర్స్‌లో 192 మంది అధికారుల కొరత ఉన్నట్లు మంత్రి తెలిపారు.

రక్షణశాఖలో అధికారికంగా ఉండాల్సిన సంఖ్య 49933కి గాను, 42635 మంది ఉన్నారు. నావీలో 11352 అధికారులకు  9746 మంది, ఎయిర్‌ఫోర్స్‌లో 12392కి గాను 12584 మంది ఉన్నట్లు తెలిపారు. జాతీయ సరిహద్దు ప్రాంతాల్లో ఇటు చైనా, అటు పాకిస్తాన్‌తో ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో త్రివిధ దళాలను పటిష్టం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోన్న విషయం తెలిసిందే. రక్షణశాఖలో పెద్దఎత్తున ఖాళీలు ఏర్పడటంపై ప్రతిపక్షం తీవ్రంగా విమర్శిస్తోంది. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని రక్షణ శాఖను బలోపేతం చేయాలని ‍ప్రతిపక్ష సభ్యులు డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు