అరుణాచల్‌ప్రదేశ్ మా అంతర్భాగమే..

29 Jun, 2014 02:36 IST|Sakshi

చైనా మ్యాప్‌పై అభ్యంతరం వ్యక్తం చేసిన భారత్

నూఢిల్లీ: అరుణాచల్‌ప్రదేశ్ తమ భూభాగంలోని ప్రాంతంగా పేర్కొంటూ చైనా రూపొందించిన తాజా మ్యాప్‌పై భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. చిత్ర పటాల్లో చూపినంత మాత్రాన వాస్తవ పరిస్థితి మారిపోదని, అరుణాచల్ ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగమని పేర్కొంది. అరుణాచల్‌లోని వివాదాస్పద ప్రాంతాలను, దక్షిణ చైనా సముద్రాన్ని చైనాలో అంతర్భాగంగా చూపుతూ ఇటీవల ఆ దేశం విడుదల చేసిన మ్యాప్‌లపై..

కేంద్ర విదేశాంగ శాఖ అధికారులను వివరణ కోరగా వారు పైవిధంగా స్పందించారు. అరుణాచల్ పూర్తిగా భారత్‌లో అంతర్భాగమని, ఇదే అంశాన్ని పలుసార్లు చైనా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్న ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ నేతృత్వంలోని బృందం కూడా చైనా ప్రతినిధుల వద్ద ఈ అంశాన్ని లేవనెత్తే అవకాశం ఉందని వెల్లడించారు.
 

మరిన్ని వార్తలు