అంగరంగ వైభవంగా ‘పవర్’ ఆడియో విడుదల | Sakshi
Sakshi News home page

అంగరంగ వైభవంగా ‘పవర్’ ఆడియో విడుదల

Published Sun, Jun 29 2014 2:34 AM

అంగరంగ వైభవంగా ‘పవర్’ ఆడియో విడుదల

  • సీడీని విడుదల చేసిన మహేష్‌బాబు
  • సాక్షి, బళ్లారి : కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్, హీరోయిన్ త్రిష నటించిన ‘పవర్’ సినిమా ఆడియో విడుదల శనివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. బళ్లారిలోని మున్సిపల్ హైస్కూల్ మైదానంలో కళ్లు జిగేల్‌మనేలా ఏర్పాట్లు చేశారు. ఆడియో సీడీని తెలుగు ప్రముఖ హీరో ప్రిన్స్ మహేష్‌బాబు చేతుల మీదుగా విడుదల చేయించారు.

    తెలుగులో ప్రభంజనం సృష్టించిన దూకుడు సినిమా  రీమేక్‌గా పవర్ పేరుతో కన్నడంలో తీశారు. దీంతో మహేష్‌బాబు చేతుల మీదుగా సీడీని విడుదల చేయించారు. కన్నడ స్టార్ పునీత్, తెలుగు సినీ స్టార్ మహేష్‌బాబు హాజరు కావడంతో మున్సిపల్ హైస్కూల్ మైదానం భారీ జనసందోహంతో కిక్కిరిసిపోయింది. ఆడియో రిలీజ్ అనంతరం పాటలు, డ్యాన్స్‌లతో మున్సిపల్ స్టేడియం హోరెత్తింది.

    అంతకు ముందు పునీత్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ బళ్లారిలో పవర్ సినిమా ఆడియో రిలీజ్ చేయడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. బళ్లారి కళలకు పుట్టినిల్లు అని అప్పాజీ ఎప్పుడూ చెప్పేవారని గుర్తు చేశారు. ఈ చిత్రాన్ని తాము రెండు వారాల పాటు బళ్లారి పరిసరాలలోనే చిత్రీకరించామని, ప్రప్రథమంగా తాను నటించిన 14 రీల్స్ సినిమా ఇది అన్నారు. ఆడియో రిలీజ్‌ను బళ్లారిలో అందులోను తెలుగు సూపర్‌స్టార్ మహేష్‌బాబు చేతుల మీదగా విడుదల చేయడం నిజంగా ఎంతో సంతోషంగా ఉందన్నారు.
     
    హీరో మహేష్‌బాబు మాట్లాడుతూ దూకుడు సినిమా రీమేక్‌ను పవర్‌స్టార్ పునీత్ ద్వారా కన్నడంలో తీయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తెలుగులో దూకుడు చిత్రం సూపర్ డూపర్ హిట్ అయినట్లుగానే కన్నడంలో కూడా సూపర్ డూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు, దర్శకులు, సంగీత దర్శకుడు తమన్ తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ కార్యక్రమానికి చిత్రం హీరోయిన్ త్రిష హాజరు కాలేదు.

Advertisement

తప్పక చదవండి

Advertisement