న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పార్టీ నేతలందరికీ సమన్లు జారీచేశారు. తన ఇంటికి రమ్మని అందరినీ చాలా గట్టిగా ఆదేశించారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ దెబ్బతినడంతోపాటు పార్టీ వ్యవహారంతో పార్టీకి ఉన్న పాపులారిటీ ప్రతి రోజు కొద్దికొద్దిగా పడిపోతున్న నేపథ్యంలో ఆత్మరక్షణలో పడ్డ కేజ్రీవాల్ పార్టీ నేతలందరినీ ఒకసారి ఇంటికి రావాలని ఆదేశించారు. ఆదివారం జరిగిన ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి ఆప్ రెండో స్థానానికి పడిపోయిన విషయం తెలిసిందే.
అంతకుముందు భారీ మొత్తంలో విజయం కట్టబెట్టిన ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్కు ఇలాంటి తీర్పునివ్వడం పార్టీ మనుగడకే దాదాపు ప్రశ్నార్థక పరిస్ధితి. ఆప్ నీటిమీద గాలిబుడగేనా అంటూ రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరోపక్క, ఆప్లో రాజీనామాల పరంపర మొదలైంది. ఇటీవలె దిలీప్ పాండే ఢిల్లీ ఇంచార్జీ బాధ్యతల నుంచి తప్పుకోవడం, పంజాబ్లో పార్టీ బాధ్యతల నుంచి సంజయ్ సింగ్ ఇంకొంతమంది తప్పుకోవడం వంటి పరిణామాలు పార్టీలో భిన్నస్వరాలు వినిపించడంతోపాటు ధిక్కారాలు కూడా బహిరంగం అవుతుండటంతో మరోసారి కేజ్రీవాల్ పెద్ద మొత్తంలో పార్టీ నేతలను కలిసి ప్రస్తుత పరిస్థితులపై చర్చించనున్నారు.