అస్సాంలో చిచ్చు.. మేఘాలయలో మంట

2 Aug, 2018 15:45 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అస్సాంలో సంక్షోభం సష్టించిన ‘ఎన్‌ఆర్‌సీ’ పౌరసత్వ జాబితా ఇప్పుడు సరిహద్దులోని మేఘాలయలో ప్రకంపనలు సష్టిస్తోంది. అస్సాం పౌరసత్వ జాబితాలో దాదాపు 40 లక్షల మంది గల్లంతయిన నేపథ్యంలో వారంతా తమ రాష్ట్రంలోకి అక్రమంగా తరలి వచ్చి స్థిరపడుతారన్న ఆందోళన మేఘాలయ పౌరుల్లో మొదలయింది. ముఖ్యంగా రాష్ట్ర ఆదిమ తెగ  ఖాసీ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థుల సంఘం రంగంలోకి దిగి సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసింది. తూర్పు జెంటియా హిల్స్‌ జిల్లా, పశ్చిమ ఖాసి హిల్స్‌ జిల్లా, రైబోయి జిల్లా సరిహద్దులో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినట్లు ఖాసి విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి డొనాల్డ్‌ వి. తాబా మీడియాకు తెలిపారు. అస్సాంలోని బారక్‌ వ్యాలీ జిల్లాల వాసులు తమ రాష్ట్ర రాజధాని గువాహటి వెళ్లాలంటే మేఘాలయ మీదుగా వెళుతారు. ఇది వారికి చాలా దగ్గరి దారి.

అస్సాం నుంచి మేఘాలయలోకి వివిధ వాహనాల్లో వస్తున్న వారందరిని ఈ చెక్‌పోస్టుల వద్ద నిలిపేసి గుర్తింపు కార్డులను, ఇతర డాక్యుమెంట్లను తనిఖీ చేస్తున్నారు. ముఖ్యంగా మూడు రోజుల క్రితం విడుదల చేసిన అస్సాం పౌరసత్వ జాబితాలో పేర్లున్నాయా, లేవా? అని ప్రశ్నిస్తున్నారు. లేవంటే వెనక్కి పంపిస్తున్నారు. ఉన్నాయంటే అందుకు రుజువులు చూపించమని అడుగుతున్నారు. వెనక్కి పంపించే క్రమంలో కొన్ని చోట్ల గొడవలు కూడా జరిగినట్లు వార్తలొచ్చాయి. ఖాసి విద్యార్థులు పలువురు అస్సామీలను చితకబాదినట్లు ఫిర్యాదులు అందాయి. ఖాసి కమ్యూనిటీకి చెందిన ప్రజలు గత జూన్‌ నెలలోనే ఓ చిన్న వివాదాన్ని పురస్కరించుకొని మొత్తం సిక్కులను తమ రాష్ట్రం నుంచి పంపించేయడంటూ ఆందోళనలు నిర్వహించడం, ఆ సందర్భంగా విధ్వంసకాండ చెలరేగడం తెల్సిందే. పంజాబ్‌ నుంచి సిక్కులు అక్రమంగా వలస రావడం వల్ల తమ ఉపాధి, విద్యావకాశాలను వారే తన్నుకుపోతున్నారని వారి ఆరోపణ. బంగ్లా దేశీయులకు వర్క్‌ పర్మిట్లు ఇచ్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి సీకే సంగ్మా ప్రయత్నించినప్పుడు కూడా వారు తీవ్రంగా ప్రతిఘటించారు.

ఈ నేపథ్యంలో అస్సాం సమస్య తమ పీకల మీదకు వచ్చిందని వారు భావిస్తున్నారు. సరైన డాక్యుమెంట్లు లే ని అస్సాం ప్రయాణికులను దౌర్జన్యంగా వెనక్కి పంపిస్తున్నారు. అక్కడక్కడ దౌర్జన్య సంఘటనలు జరిగిన మాట వాస్తవమేనని, ఇక ముందు అలాంటి సంఘటనలు పునరావతం కాకుండా చర్యలు తీసుకున్నామని మేఘాలయ హోం మంత్రి జేమ్స్‌ సంగ్మా తెలిపారు. అక్రమ వలసలను నిరోధించే పోలీసులతో రాష్ట్ర ప్రభుత్వమే చెక్‌పోస్టులను ఏర్పాటు చేసిందని విద్యార్థులు వారికి సహకరిస్తున్నారని ఆయన వివరించారు. పోలీసులు, జిల్లా అధికారుల సహకారంతోనే తాము చెక్‌పోస్టులను నిర్వహిస్తున్నామని విద్యార్థులు తెలియజేశారు. తన నియోజక వర్గానికి చెందిన ప్రయాణికులు మేఘాలయలోకి అడుగుపెట్టకుండా అడ్డుకుంటున్నారని, ప్రయాణికులకుండే స్వేచ్ఛను హరించడమే కాకుండా చితక బాదుతున్నారంటూ అస్సాంలోని సిల్చార్‌ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్‌ ఎంపీ సుష్మితా దేవ్‌ కేంద్ర హోం మంది రాజ్‌నాథ్‌ సింగ్‌కు ఓ లేఖ రాశారు.

చదవండి: అమిత్‌ షా మాటల్లో మర్మమేమిటీ?
 

ఫక్రుద్దీన్‌ ఫ్యామిలీ కూడా పరాయివారేనా!
 

‘అసోం’లో అసలు ఏం జరుగుతోంది?
 

మరిన్ని వార్తలు