బాబుల్‌ సుప్రియోను అడ్డుకున్నవిద్యార్థులు

19 Sep, 2019 18:07 IST|Sakshi

కోల్‌కతా: బీజేపీ ఎంపీ బాబుల్‌ సుప్రీయోకు విద్యార్థుల నిరసన సెగ తగిలింది. గురువారం కోల్‌కతాలోని జాదవ్‌పూర్‌ యూనివర్సిటీలో ఏబీవీపీ విద్యార్థులు ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి బాబుల్‌ సుప్రియో హాజరయ్యారు. ఈ క్రమంలో కాలేజీలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన బాబుల్‌ సుప్రియోను కొందరు విద్యార్థులు అడ్డుకుని గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. వీరంతా స్టూడెంట్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఎఫ్‌ఐ), ఆల్‌ ఇండియా స్టూడెంట్‌ ఫెడరేషన్‌ అసోసియేషన్‌కు(ఏఎస్‌ఎఫ్‌ఏ) చెందిన వారు కావడం విశేషం. విద్యార్థుల నిరసన నేపథ్యంలో బాబుల్‌ సుప్రియో క్యాంపస్‌లోకి వెళ్లకుండానే వెను తిరిగారు.

ఈ సందర్భగా బాబుల్‌ మాట్లాడుతూ.. ‘నేను రాజకీయాలు చేయడం కోసం ఇక్కడకు రాలేదు. కానీ విద్యార్థుల ప్రవర్తన చూస్తే నాకు చాలా బాధ కలుగుతుంది. వారు నన్ను అడ్డుకున్నారు. నా జుట్టు పట్టుకు లాగారు. కింద పడేసారు. వారంతా తమను తాము నక్సల్స్‌గా పిలుచుకుని నన్ను రెచ్చగొట్టాలని చూశారు. కానీ వారు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా నన్ను రెచ్చగొట్టలేరు’ అని పేర్కొన్నారు. ఆ సమయంలో గవర్నర్‌ జగదీప్‌ ధంఖర్‌, యూనివర్సిటీ చాన్సిలర్‌ అక్కడే ఉన్నారు. జరిగిన విషయాన్ని గవర్నర్‌ సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు