కాస్‌గంజ్‌ అల్లర్లు.. కలెక్టర్‌ పోస్టుతో ప్రకంపనలు

30 Jan, 2018 12:21 IST|Sakshi

లక్నో : కాస్‌గంజ్‌ మత ఘర్షణలపై బరేలీ కలెక్టర్‌ తన ఫేస్‌బుక్‌లో చేసిన ఓ పోస్టు ప్రకంపనలు రేపుతోంది. అల్లర్లపై కలెక్టర్‌ ఆర్‌ విక్రమ్‌ సింగ్‌ ఆదివారం అల్లర్లపై ఓ సందేశం పోస్టు చేశారు. ముస్లింల ప్రాంతాల్లోకి వెళ్లి వెళ్లి పాక్‌ వ్యతిరేక నినాదాలు చేయాల్సిన అవసరం ఏంటన్న? ప్రశ్నను ఆయన సంధించటంతో అది కాస్త వివాదాస్పదంగా మారింది.

పోస్ట్‌ పూర్తి సారాంశం... ‘‘ఓ కొత్త సంప్రదాయం పుట్టుకొచ్చింది. ఘర్షణలు చెలరేగినప్పుడల్లా కొందరు చేసే పనులు విచిత్రంగా ఉంటాయి. మాట్లాడితే ఇస్లాం ప్రజల ఇళ్ల ముందుకు వెళ్లి పాక్‌ వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు. ఇదంతా ఎందుకు? వారేమైన పాకిస్థాన్‌ వాసులా? కాదు కదా! అని పేర్కొంటూ ఫేస్‌బుక్‌లో సుదీర్ఘమైన పోస్టు ఒకదానిని పెట్టారు. గతేడాది బరేలీలో జరిగిన ఘర్షణల ప్రస్తావన కూడా ఆయన తీసుకొచ్చారు. కొందరు కన్వరియాలు(శైవ భక్తులు) ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతంలోకి పాక్‌ వ్యతిరేకంగా వెళ్లి నినాదాలు చేశారు. ఆ ప్రాంతంలోనే నా నివాసం కూడా ఉంది. బయటికొచ్చిన నేను వారిని అలా చేయొద్దని వారించాను. కానీ, వారు నా మాట వినలేదు. ఇంతగా మత పిచ్చి వాళ్లకు ఎందుకు? ఇది దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తాయి అంటూ పోస్ట్‌ చేశారు.  

దీనిపై తీవ్ర దుమారం చెలరేగింది. రాజ్యాంగబద్ధమైన పదవి హోదాలో మతపరమైన వ్యాఖ్యలు చేయటాన్ని ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు తప్పుబడుతున్నారు. ఉత్తర ప్రదేశ్‌ ఆర్థిక శాఖ మంత్రి రాజేష్‌ అగర్వాల్‌(బరేలీ ఎమ్మెల్యే కూడా) ‘సింగ్‌ పోస్టు’పై స్పందించారు. ‘‘ఆయన(ఆర్‌వీ సింగ్‌) చేసిన పోస్ట్‌ను చూడలేదు. ఆర్మీలో పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. సొంత దేశానికి వ్యతిరేకంగా.. పాక్‌కు అనుకూలంగా ఆయన మాట్లాడి ఉంటాడని నేను అనుకోను’ అని మంత్రి మీడియాతో చెప్పారు.

 

విక్రమ్‌ సింగ్‌ అధికారిక ఫేస్‌ బుక్‌లోని కొంత భాగం స్క్రీన్‌ షాట్‌

ఇక విమర్శలపై సింగ్‌ స్పందించారు.‘ఇది చాలా చిన్న విషయం. అయినా భూతద్ధంలో చూస్తున్నారు. కాస్‌గంజ్‌ ఎస్పీని బదిలీ చేశారు. నిజాయితీగా పని చేస్తున్న నాలాంటి అధికారిపై విమర్శలు చేస్తున్నారు. ఈ పరిణామాలన్నీ అభివృద్ధికి ఆటంకాలే’అని సింగ్‌ చెప్పారు. 

గణతంత్ర‍్య దినోత్సవ వేడుకలో భాగంగా విద్యార్థి సంఘాలు బద్దూ నగర్‌లో ‘తిరంగ ర్యాలీ’ నిర్వహించగా.. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగి అది కాస్త హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో యువకులు గాయపడ్డారు. మరుసటి రోజు చెలరేగిన ఘర్షణలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. కర్ఫ్యూ విధించి ఇంటర్నెట్‌ సేవలను నిలిపవేశారు. మొత్తం 80 మందిని అరెస్ట్‌ చేసిన పోలీసులు.. పరిస్థితి సర్దుమణగటంతో మంగళవారం ఉదయం నుంచి కర్ఫ్యూను సడలిస్తున్నట్లు ప్రకటించారు.

మరిన్ని వార్తలు