డేంజర్‌ గేమ్‌‌... నేను మాత్రం బతికిపోయా!

29 Aug, 2017 08:31 IST|Sakshi
డేంజర్‌ గేమ్‌‌... నేను మాత్రం బతికిపోయా!
కోల్‌కతా: రష్యాలో మొదలైన బ్లూ వేల్‌ ఛాలెంజర్‌.. సూసైడ్‌ గేమ్‌గా మారి 100 మందికి పైగా ప్రాణాలు బలి తీసుకున్న విషయం తెలిసిందే. మనదేశంలో కూడా ఇప్పటిదాకా అరడజను విద్యార్థులు ఈ భూతానికి బలైపోయారు. అయితే కోల్‌కతాకు చెందిన ఓ స్టూడెంట్‌ మాత్రం ప్రాణాలతో బయటపడి, ఆ భయానక అనుభవాన్ని వివరిస్తున్నాడు.
 
ఇంజనీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతున్న ఆ యువకుడు వాట్సాప్‌లో వచ్చిన హెచ్చరికల నేపథ్యంలో బ్లూ వేల్‌ ఆటపై మక్కువ పెంచుకున్నాడు. ఓ స్నేహితుడి ల్యాప్‌ టాప్‌ నుంచి గేమ్‌ ను డౌన్‌ లోడ్‌ చేసుకుని ఆట ఆడటం మొదలుపెట్టాడు. ఒక్కో లెవల్‌ దాటుకుంటూ మెల్లిగా 8 లెవల్‌కి చేరుకున్నాడు కూడా. తర్వాతి లెవెల్‌లో భాగంగా పెదవులను కోసుకోవాల్సి ఉంది. కానీ, భయంతో తాత్కాలికంగా ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. 
 
ఇంతలో అతను బ్లూ వేల్‌ గేమ్‌ ఆడుతున్న విషయాన్ని గమనించిన తోటివిద్యార్థులు విషయాన్ని కాలేజీ రిజిస్ట్రారర్‌ తపస్‌ సతాపతి దృష్టికి తీసుకెళ్లారు. అప్పటికే సోషల్‌ మీడియాలో దీని గురించి అవగాహన కల్పించటంతో తపస్‌ పోలీసుల సాయం కోరారు. గత బుధవారం ఓ సీఐడీ అధికారి,  విద్యార్థిని మరియు అతని తల్లిదండ్రలను కూర్చోబెట్టి ఈ రాకాసి గేమ్‌ గురించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించివేశారు. 


 
ఆటలో భాగంగా తన చేతిపై బ్లేడ్‌తో గేమ్‌ సింబల్‌ను గీసుకున్న బాలుడు ఆ గాయన్ని చూపిస్తూ ‘నేను ప్రాణాలతో బతికిపోయా’ అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ‘క్రమక్రమంగా బ్లూవేల్‌కు నేను బానిసను అయ్యాను. అందులోని ఒక్కో సూచనలు నాలో మరింత ఆసక్తిని రేకెత్తించాయి. అయితే శరీరానికి గాయాలు చేసుకున్న సమయంలో మాత్రం కాస్త వణికిపోయాను’ అని అతను వివరించాడు.  తన స్నేహితులకు, ఉపాధ్యాయులకు మరియు కౌన్సిలింగ్ ఇచ్చిన సీఐడీ ఆఫీసర్‌కు రుణపడి ఉంటానని సదరు విద్యార్థి చెబుతున్నాడు. 
 
బ్లూవేల్‌ గేమ్‌ దాటికి గత నెలలో ముంబైలో ఓ స్కూల్‌ విద్యార్థి భవనం నుంచి దూకి చనిపోగా, కేరళలోనూ ఓ ఆత్మహత్య నమోదయ్యింది. తాజాగా ఉత్తర ప్రదేశ్ లో 13 ఏళ్ల పార్థ్‌ సింగ్‌ ఉరి వేసుకుని చనిపోయిన విషయం విదితమే. 
మరిన్ని వార్తలు