'శశికళకు పెరోల్‌పై మాకు నో ప్రాబ్లమ్‌'

5 Oct, 2017 18:20 IST|Sakshi

సాక్షి, చెన్నై : అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న దివంగత ముఖ్యమంత్రి జయలలిత నిచ్చెలి శశికళకు పెద్ద ఊరట లభించినట్లయింది. ఆమెకు పెరోల్‌ ఇచ్చేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ కర్ణాటక ప్రభుత్వం కోర్టుకు వివరించింది. దీంతో ఆమెకు పెరోల్‌ లభించేందుకు అవకాశం లభించినట్లయింది. గత కొంతకాలంగా తన భర్త నటరాజన్‌ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో శశికళ భర్త ఎం నటరాజన్‌ చికిత్స పొందుతున్నారు.

లివర్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో ఉన్న నటరాజన్‌కు ప్రస్తుతం డయాలసిస్‌, ఇతర ఇంటెన్సివ్‌ కేర్‌ థెరఫీస్‌ను వైద్యులు అందిస్తున్నారు. దీంతో ఆయనను చూసేందుకు తనకు అనుమతించాలని, పదిహేను రోజులపాటు తనకు పెరోల్‌ మంజూరు చేయాలంటూ జైలు శాఖకు విజ్ఞప్తి చేసుకోగా నిరాకరించింది. అయితే, జైలుశాఖ నిరాకరించగా ఆ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లగా ప్రభుత్వ వైఖరి ఏమిటని కోర్టు ప్రశ్నించింది. దీంతో ఆమెకు పెరోల్‌ ఇచ్చేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పడంతో బహుశా ఆమెకు పెరోల్‌ లభించే అవకాశం ఏర్పడింది.

మరిన్ని వార్తలు