న్యూఢిల్లీ: దేశంలోని కొన్నిప్రాంతాల్లో బర్డ్ఫ్లూ(ఏహెచ్5ఎన్8 వైరస్) కలకలం రేపుతుండటంతో కేంద్రం అప్రమత్తమైంది. ఈ వైరస్ వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్రాలకు సూచనలు జారీచేసింది. ఢిల్లీ, గ్వాలియర్(మధ్యప్రదేశ్), కేరళలోని కొన్ని పక్షులకు ఈ వైరస్ సోకినట్లు తేలింది.
ఏహెచ్5ఎన్8 వైరస్ మనుషులకు అంటుకునే అవకాశాలు తక్కువగా ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. అయినప్పటికీ కేంద్రం ముందుజాగ్రత్తగా అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు సూచనలు జారీచేసిందని ఆరోగ్య శాఖ కార్యదర్శి సీకే మిశ్రా చెప్పారు. చనిపోయిన, గాయాలైన పక్షుల విషయంలో సంబంధిత వ్యక్తులు రక్షణాత్మక చర్యలు తీసుకోవాలన్నారు.