హాస్టల్‌ గదిలో మరో పీహెచ్‌డీ విద్యార్థి..! | Sakshi
Sakshi News home page

హాస్టల్‌ గదిలో మరో పీహెచ్‌డీ విద్యార్థి..!

Published Wed, Oct 26 2016 8:44 AM

హాస్టల్‌ గదిలో మరో పీహెచ్‌డీ విద్యార్థి..!

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్‌ లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) హాస్టల్‌లో ఓ పీహెచ్‌డీ విద్యార్థి అనుమానాస్పదంగా మృతిచెందాడు. అతని మరణానికి కారణం ఏమిటి అన్నది తెలియరాలేదు. మణిపూర్‌కు చెందిన జేఆర్‌ ఫిలెమన్‌ తన బ్రహ్మపుత్ర హాస్టల్‌ గదిలో విగతజీవిగా కనిపించాడు. అతడు గత మూడు రోజులుగా అదృశ్యమయ్యాడని, ఇంతలోనే ఈ ఘటన జరిగిందని పోలీసులు చెప్తున్నారు. అతని గది నుంచి తీవ్ర దుర్వాసన వస్తుండటంతో విద్యార్థులు సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో గది తలుపులు తెరిచి చూడగా.. ఫిలెమన్‌ విగతజీవిగా కనిపించాడు.

ఇప్పటికే విద్యార్థి నజీబ్‌ అహ్మద్‌ కనిపించకుండా పోవడంపై జేఎన్‌యూ క్యాంపస్‌ విద్యార్థుల ఆందోళనలతో అట్టుడుకుతోంది. హాస్టల్‌లో విద్యార్థులతో గొడవ జరిగిన తర్వాత అదృశ్యమైన నజీబ్‌ ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. నజీబ్‌ జాడ కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులు వర్సిటీ వీసీ, సీనియర్‌ అధికారులను కార్యాలయంలో ఒక రాత్రి మొత్తం నిర్బంధించి ధర్నా చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు నజీబ్‌ ఆచూకీ గురించి తెలియజేస్తే రూ. లక్ష నజరానా ఇస్తామని  ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్న ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. ఇంతలో పీహెచ్‌డీ విద్యార్థి మరణం వర్సిటీని కుదిపేస్తున్నది.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement