రాయ్‌బరేలీ ప్రమాదంలో 25 మందిపై కేసు

31 Jul, 2019 19:02 IST|Sakshi

ఉన్నావ్‌ రేప్‌ బాధితురాలు ప్రయాణీస్తున్న వాహనం ప్రమాదానికి గురై ఇద్దరు చనిపోగా, బాధితురాలు, ఆమె లాయరు తీవ్ర గాయాల పాలయిన సంగతి తెలిసిందే. ఆ ఘటనపై వివిధ వర్గాల నుంచి వచ్చిన ఒత్తిడితో ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో సిబిఐ దాదాపు 25 మందిని నిందితులుగా పేర్కొంటూ కేసును దర్యాప్తు చేస్తోంది. ఇందులో గతంలో అత్యాచారానికి పాల్పడిన  ఎమ్మెల్యే కుల్‌దీప్‌ సింగ్‌ సెంగార్,అతని సోదరునితో పాటు అతని లాయరు, అతనికి సన్నిహితంగా ఉన్న జర్నలిస్టులతో పాటు అరుణ్‌ సింగ్‌ అనే వ్యక్తిని చేర్చింది. ఈ అరుణ్‌ కుమార్‌ అనే వ్యక్తి ఆ రాష్ట్ర క్యాబినెట్‌ మినిస్టర్‌ అయిన  రణ్‌వేంద్ర సింగ్‌కు అల్లుడు కావడం గమనార్హం. రణ్‌వేంద్ర సింగ్‌ ఫతేపూర్‌ అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికయ్యారు. అలాగే ప్రమాదానికి కారణమైన వాహనం ఫతేపూర్‌లోనే రిజిస్టర్‌ అవ్వడం, వాహన డ్రయివరు కూడా ఫతేపూర్‌కు చెందిన వాడు కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయంపై మినిస్టర్‌ రణ్‌వేంద్ర సింగ్‌ను ప్రశ్నించగా.. అరుణ్‌ సింగ్‌ నా బంధువన్నది నిజమే. ఈ విషయం అందరికీ తెలుసు. అయినా ఈ ప్రమాదం కావాలని చేసినట్టు కనపడటం లేదు. ఏదేమైనా సిబిఐ విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయని వ్యాఖ్యానించారు. కాగా, బుధవారం సిబిఐకి చెందిన 12 మంది అధికారుల బృందం ఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించింది.  

మరిన్ని వార్తలు