మంత్రివర్గ విస్తరణ గురించి తెలియదు : కేటీఆర్‌

31 Jul, 2019 18:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పార్టీ కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటామని టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు అన్నారు. జూన్‌ 27 నుంచి జూలై 31 వరకు 50 లక్షల సభ్యత్వాలు నమోదు చేయించామని తెలిపారు. సభ్యులుగా చేరిన వారికి ప్రమాద బీమా అందేలా చూస్తామని, యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీకి రూ.11 కోట్ల 21 లక్షల రూపాయలకు చెక్‌ ఇచ్చామని వెల్లడించారు. సభ్యత్వ కార్యక్రమంలో క్రియాశీలంగా పనిచేసిన నేతలందరికీ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ భవన్‌లో బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ నేతలు గతంలో కూడా పెద్దపెద్ద మాటలు మాట్లాడారని.. కొందరు గడ్డాలు కూడా తియ్యమని శపథాలు చేశారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలకు సమస్యలు దొరకడం లేదని.. అందుకే పసలేని విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఎన్నికల్లోనే వారికి సమాధానం చెబుతామని చెప్పారు. మంత్రివర్గ విస్తరణ గురించి తనకు తెలియదన్నారు. గవర్నర్‌ నరసింహన్‌ను మర్యాదపూర్వకంగా కలిసినట్టు వెల్లడించారు.

మరిన్ని వార్తలు