నేపథ్య గాయనిగా సీఎం సతీమణి

4 Mar, 2016 08:46 IST|Sakshi
నేపథ్య గాయనిగా సీఎం సతీమణి

ఆమె స్వయానా ఓ ముఖ్యమంత్రి భార్య. పేరు అమృతా ఫడ్నవీస్. ఇప్పుడు ప్రియాంకా చోప్రా నటిస్తున్న 'జై గంగాజల్' అనే సినిమాలో నేపథ్య గాయని అవతారం ఎత్తారు. అవును.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఈ సినిమాలో ఓ పాట పాడారు. ప్రకాష్ ఝా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆమె ఓ భక్తి పాట పాడారు. అయితే, దీనికి గానీ.. మరే ఇతర గాన కార్యక్రమాలకు గానీ తాను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని, వాళ్లు ఇస్తామన్నా అంగీకరించలేదని అమృత చెప్పారు.

సలీమ్ సులేమాన్ అందించిన స్వరాలు, మనోజ్ ముంతాషిర్ రాసిన పదాలు చాలా అద్భుతంగా ఉన్నాయని, అవి పాడుతున్నంత సేపూ తాను మైమరచిపోయానని అమృత తన అనుభవాన్ని వివరించారు. ఈ ఆఫర్ వచ్చేసరికి తాను మరో సినిమాలో పాట పాడుతున్నానని, తాను ఆ పాట పాడుతుండగా విన్న ప్రకాష్ ఝా.. ఆయన సినిమాలో పాటకు తన గొంతు సరిపోతుందని భావించి అడిగారని తెలిపారు. ఒకటిన్నర రోజులో రికార్డింగు పూర్తయింది. తన భర్త, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా తన పాటను ఎంతగానో మెచ్చుకున్నారని.. జై గంగాజల్ సినిమా మహిళా కేంద్రీకృతంగా ఉంటుందని ఆమె అన్నారు. అమృత స్వతహాగా బ్యాంకర్. దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి కాగానే ఆమె తన కుమార్తె దివిజతో కలిసి ముంబైకి మారిపోయారు.

>
మరిన్ని వార్తలు