పెద్దల సభ ముందుకు ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు

30 Dec, 2018 16:01 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ట్రిపుల్ తలాక్ బిల్లుపై పాలక బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ ముఖాముఖీ పోరుకు సంసిద్ధమయ్యాయి. లోక్‌సభలో ట్రిపుల్‌ తలాక్‌ తాజా బిల్లును ఆమోదింపచేసుకున్న ప్రభుత్వం సోమవారం పెద్దల సభలోనూ బిల్లును ప్రవేశపెడుతుండటంతో ఉత్కంఠ నెలకొంది. బిల్లుపై ఓటింగ్‌ జరుగుతుందనే అంచనాతో బీజేపీ, కాంగ్రెస్‌లు తమ సభ్యులను సోమవారం పార్లమెంట్‌ సమావేశాలకు విధిగా హాజరు కావాలని కోరుతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. మతపరమైన వ్యవహారాల్లో ప్రభుత్వం తలదూర్చరాదని ఆ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

మరోవైపు కాంగ్రెస్‌ ఇప్పటికే పార్లమెంట్‌ ఉభయసభల్లోని సభ్యులను పార్లమెంట్‌ సమావేశాలకు విధిగా హాజరు కావాలని విప్‌ జారీ చేసింది. కాగా, ట్రిపుల్ తలాక్ బిల్లు గత గురువారం విపక్షాల వాకౌట్ మధ్య లోక్‌సభ ఆమోదం పొందింది  ఇక సోమవారం రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రవేశపెట్టి, సభామోదం పొందాలని బీజేపీ పట్టుదలగా ఉంటే, బిల్లును తాము సూచించిన మార్పులు చేపట్టకుంటే ఆమోదించేది లేదని కాంగ్రెస్‌ తేల్చిచెబుతోంది.

మరిన్ని వార్తలు