నేను కూడా డిప్రెష‌న్‌ను ఎదుర్కొన్నాను

17 Jun, 2020 15:56 IST|Sakshi

న్యూఢిల్లీ: బాలీవుడ్ యంగ్ అండ్ డైన‌మిక్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మ‌ర‌ణంపై యావ‌త్ దేశం దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసింది. మాన‌సిక కుంగుబాటుతో అత‌ను ఉరి వేసుకుని చ‌నిపోవ‌డం ప‌ట్ల ఆయ‌న అభిమానులు గుండెలు ప‌గిలేలా రోదిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఎంతోమంది న‌టీన‌టులు తాము సైతం డిప్రెష‌న్‌ను ఎదుర్కొన్న‌‌వాళ్ల‌మేనంటూ సోష‌ల్ మీడియాలో రాసుకొచ్చారు. తాజాగా రాజ‌స్థాన్‌కు చెందిన‌ కాంగ్రెస్ నాయ‌కురాలు రుక్శామిని కుమారి(34) తాను కూడా ఒకానొక‌ప్పుడు డిప్రెష‌న్ అనే మాన‌సిక రుగ్మ‌త‌ను చ‌విచూసిన దానినేన‌ని చెప్పుకొచ్చింది. (డిప్రెష‌న్‌ను జ‌యించండిలా..)

సోష‌ల్ మీడియాలో త‌న ఫొటోను షేర్ చేస్తూ.. "నేను మాన‌సిక‌  ఆందోళ‌న‌‌, ఒత్తిడిని జ‌యించాను. కానీ ఈ రెండు రుగ్మ‌త‌లు న‌న్ను నిర్వ‌చించ‌లేవు. ఎందుకంటే ఒక‌ వ్యాపార‌వేత్త‌గా, రాజ‌కీయ నాయ‌కురాలిగా జీవితంలో ఎన్నో పాత్ర‌లు పోషించాను. డిప్రెష‌న్, ఆందోళ‌న‌ అనేవి ఓర‌క‌మైన వ్యాధి త‌ప్ప మనిషి బ‌ల‌హీన‌త‌లు కావు. వీటివ‌ల్ల నేను ఏమాత్రం సిగ్గుప‌డను" అని పేర్కొంది. దీనిపై ఆమె అభిమానులు స్పందిస్తూ రుక్శామినిని యోధులుగా కీర్తిస్తున్నారు. ఆమె ధైర్యానికి మెచ్చుకోకుండా ఉండ‌లేక‌పోతున్నారు. అన్నింటినీ ఎదుర్కునేందుకు ఆమెకు మ‌రింత శ‌క్తి చేకూరాల‌ని ప్రార్థిస్తున్నారు. (అవును... త్వరగా వెళ్లిపోయావ్‌ సుశాంత్‌..)

మరిన్ని వార్తలు