ఫ్యాషన్‌ డిజైనర్‌ భారీ విరాళం..

23 Mar, 2020 20:08 IST|Sakshi

ముంబై : కరోనా ఉపద్రవం విసిరిన సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషిచేస్తుంటే పలువురు సినీనటులు, సెలబ్రిటీలు తమకు తోచిన సాయంతో ముందుకొస్తున్నారు. మహమ్మారి వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు అందరూ ఇళ్లకే పరిమితమవుతుండగా పనిచేస్తేనే పూటగడిచే పేదలకు పలువురు మేమున్నామంటూ భరోసా ఇస్తున్నారు. కోవిడ్‌-19తో చిన్నాభిన్నమైన చిరువ్యాపారులు, స్వయం ఉపాధి పొందే చేతివృత్తిదారుల కోసం వైద్య నిధి కింద రూ 1.5 కోట్ల విరాళం ఇవ్వనున్నట్టు ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ అనితా డోంగ్రే తెలిపారు.

కరోనా కట్టడికి అనూహ్యంగా ప్రకటించిన లాక్‌డౌన్‌తో చిరు వ్యాపారులపై పెనుప్రభావం చూపుతుందని, ఈ మహమ్మారితో పెరిగే వైద్య అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు తమ ఫౌండేషన్‌ ముందుకొస్తుందని ఇన్‌స్టాగ్రాం పోస్ట్‌లో ఆమె పేర్కొన్నారు. పేదలు, చిరువ్యాపారులు, చేతివృత్తిదారులు కరోనా బారిన పడితే వారి వైద్య అవసరాల కోసం తమ ఫౌండేషన్‌ రూ 1.5 కోట్లతో నిధిని ఏర్పాటు చేస్తుందని వెల్లడించారు. తమ ఉద్యోగులందరికీ వైద్య బీమా ఉందని, ఎమర్జెన్సీ తలెత్తితే వైద్య నిధి నిధులను వారి కోసం కూడా వెచ్చిస్తామని డిజైనర్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు