సేవల అంతరాయంపై స్పందించిన ఫేస్‌బుక్‌

4 Jul, 2019 10:41 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్ట్రాగాం సేవలు తిరిగి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. త‌మ సేవ‌ల‌ను వంద శాతం పున‌రుద్ధరించామని ప్రముఖ సోషల్‌ మీడియా దిగ్గజ సంస్థలు ప్రకటించాయి. సేవలకు అంతరాయం కలిగినందుకు యూజర్లకు క్షమపణలు తెలియజేశాయి. నేటి నుంచి యధాతథంగా పూర్తి స్థాయి సేవలు అందుబాటులోకి తెచ్చామని ప్రకటించాయి .  

ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్స్‌టాగ్రామ్‌ల సేవలకు బుధవారం అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా స్మార్ట్‌ ఫోన్ వినియోగదారులు ఎక్కువగా ఈ సమస్యను ఎదుర్కొన్నారు. వాట్సాప్‌లో చాట్ మెసేజెస్ వరకు వెళ్లాయి కానీ  ఆడియో లేదా వీడియో ఫైల్స్‌ను ట్రాన్స్‌ఫర్ చేసినప్పుడు అవి డౌన్‌లోడ్‌ కాలేదు. ప్రధానంగా దక్షిణ అమెరికా, యూరప్‌ ఖండాల్లోని ప్రజలు సమస్యను ఎదుర్కొన్నారు. గురువారం నుంచి మళ్లీ వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ సేవలు యధాతథంగా అందుబాటులోకి వచ్చాయి. ఈ సమస్యపై ఫేస్‌బుక్‌ యాజమాన్యం స్పందింస్తూ.. సమస్యను గుర్తించి పరిష్కరించామని, ఇకపై తమ సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపింది.

‘నిన్న ఫేస్‌బుక్‌ సేవలకు అంతరాయం కలిగినందుకు చింతిస్తున్నాం. సర్వర్లలో తలెత్తిన సమస్య కారణంగా ఫేస్‌బుక్‌ సరిగ్గా పనిచేయలేదు. రొటీన్‌గా నిర్వ‌హించే మెయిన్‌టెన్స్ స‌మ‌యంలో కొంద‌రు యూజ‌ర్ల‌కు అప్‌లోడ్ స‌మ‌స్య ఎదురైంది. సమస్యను గుర్తించి పరిష్కరించాం. ఇకపై 100 శాతం సేవలు మీకు అందుబాటులో ఉంటాయి. అంతరాయం ఏర్పడినందుకు క్షమపణలు కోరుతున్నాం’ అని ఫేస్‌బుక్‌ యాజమాన్యం ఒక ప్రకటనలో పేర్కొంది.

మరిన్ని వార్తలు