గేదెను దొంగిలించాడని ఎంపీపై కేసు

30 Aug, 2019 20:08 IST|Sakshi

లక్నో : సాధారణంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై భూ కబ్జాలు, అవినీతి, హత్యలు, హత్యాచారాలు లాంటి కేసులు నమోదు అవుతుంటాయి. వీటిల్లో ఏదో ఒక కేసు దాదాపు ప్రతి నాయకుడిపై ఉంటుంది. ప్రస్తుత రాజకీయాల్లో అది సర్వసాధారణం కూడా. కానీ ఓ ఎంపీపై వెరైటీగా దొంగతనం కేసు నమోదు అయింది. అది కూడా ఓ విచిత్రమైన దొంగతనం. ఆ ఎంపీ కోట్ల కొద్ది డబ్బులో లేదా తులాల కొద్ది బంగారమో దోపిడీ చేశాడని కేసు నమోదు కాలేదు. కేవలం ఓ గేదెను దొంగిలించాడని ఎంపీపై కేసు పెట్టారు. ఈ విచిత్ర ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని రాంపూర్‌లో చోటు చేసుకుంది. ఇక కేసు నమోదు అయిన ఎంపీ ఎవరో కాదు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తలో నిలిచే సమాజ్‌వాదీ పార్టీ ఫైర్ బ్రాండ్, రాంపూర్ ఎంపీ ఆజం ఖాన్‌‌. ఇప్పటికే భూకబ్జా, ల్యాండ్‌ మాఫియా ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరవుతున్నఆజం ఖాన్‌కు తాజాగా ఈ విచిత్ర  షాక్‌  తగలింది.

ఎంజీ ఆజంఖాన్‌

రాంపూర్‌కు చెందిన అసిఫ్‌, జాకీర్‌ అనే వ్యక్తులు ఆజంఖాన్‌పై ఫిర్యాదు చేశారు. తన అనుచరులతో కలిసి 2016 అక్టోబరు 15న రాంపూర్‌లోని తమ ఇంటిని ఆజంఖాన్ ధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంటి ఆవరణలో ఉన్న గేదెతో పాటు రూ.25 వేల నగదును సైతం దొంగిలించారని ఆరోపించారు. ఇంటి స్థలాలన్ని ఇవ్వాలంటూ ఎంపీ అనచరులు తమపై దాడిచేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు అజంఖాన్‌పైఎఫ్ఐఆర్ నమోదు చేశారు. .ఎంపీతో పాటుమరో 40 మంది గుర్తు తెలియని వ్యక్తుల పేర్లను కూడా ఎఫ్ఐఆర్‌లో పొందుపరిచారు.

కాగా ఎంపీ అజంఖాన్‌పై  ఇప్పటికే భూకబ్జా, వక్ఫ్‌ ఆస్తుల స్వాధీనం, రెచ్చగొట్టే వ్యాఖలు చేశారంటూ  50 కేసులు నమోదయ్యాయి. వీటిల్లో 28 కేసులు అలియాగంజ్‌ రైతులు పెట్టినవే కావడం గమనార్హం. 

మరిన్ని వార్తలు