Buffalo Swallowed Mangalsutra: మంగళసూత్రం మింగిన గేదె

2 Oct, 2023 12:21 IST|Sakshi

మహారాష్ట్రలోని వాశిం జిల్లాలో ఒక వింత ఉదంతం చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన ఒక గేదె రూ. 15 లక్షల విలువైన మంగళసూత్రం మింగేసింది. పశువైద్యులు ఆ గేదె కడుపులోని మంగళ సూత్రం తీసేందుకు దాని కడుపును కోశారు. మంగళసూత్రం బయటకు తీశాక ఆ గేదెకు 65 కుట్లు వేశారు. 

జిల్లాలోని సార్సీ గ్రామంలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. రామ్‌హరీ అనే రైతు భార్య స్నానం చేసే ముందు తన మంగళ సూత్రాన్ని తీసి, సోయాబీన్‌ తొక్కలు ఉన్న ఒక పాత్రలో పెట్టింది. స్నానం పూర్తయ్యాక, ఆ ప్లేట్‌ను తమ పశువులశాల లోని గేదె ముందు ఉంచి, ఇంటిపనులలో మునిగిపోయింది.

రెండు గంటల తరువాత తన మెడలో మంగళ సూత్రం లేని విషయాన్ని ఆమె గమనించింది. కొద్దిసేపు ఇటునటు వెదికాక తాను ఆ మంగళ సూత్రాన్ని సోయా తొక్కలున్న ప్లేట్‌లో పెట్టినట్లు గుర్తుకు తెచ్చు​​కుంది. వెంటనే ఆమె పరిగెత్తుకుంటూ పశువులశాలలోకి వెళ్లి చూసింది. గేదె తన మంగళసూత్రం మింగేసిందని గ్రహించింది. వెంటనే ఈ విషయాన్ని ఆమె భర్తకు తెలియజేసింది. 

రైతు రామ్‌హరీ ఈ విషయాన్ని ఫోనులో పశువైద్యాధికారి బాలాసాహెబ్‌కు తెలియజేశాడు. అతని సూచన మేరకు ఆ రైతు తన గేదెను వాశింలోని పశువైద్యశాలకు తీసుకు వెళ్లాడు. అక్కడ పశువైద్యాధికారి మెటల్‌ డిటెక్టర్‌తో ఆ గెదె కడుపులో మంగళసూత్రం ఉన్నదని నిర్ధారించారు. తరువాత దానికి ఆపరేషన్‌ చేసి, మంగళ సూత్రాన్ని బయటకు తీశారు. ఈ ఆపరేషన్‌ 2 గంటలపాటు సాగింది. తరువాత వైద్యుదు ఆ గేదెకు 65 కుట్లు వేశారు. కాగా తన మంగళసూత్రాన్ని గేదె కడుపు నుంచి వెలికి తీసి, తన ఐదోతనం కాపాడారంటూ ఆ రైతు భార్య వైద్యునికి కృతజ్ఞతలు తెలియజేసింది. 
ఇది కూడా చూడండి: పాక్‌ ప్రధాని జీతం ఎంత? అదనపు సౌకర్యాలు ఏముంటాయి?

మరిన్ని వార్తలు