సర్ధార్జీ పాక్‌ పర్యటన..

3 Oct, 2019 15:16 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : చారిత్రక కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభోత్సవానికి మాజీ ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ నవంబర్‌ 9న పాకిస్తాన్‌ వెళ్లనున్నారు. కర్తార్‌పూర్‌ గురుద్వారను సందర్శించే తొలి యాత్రికుల బ్యాచ్‌లో నవంబర్‌ 9న పాల్గొనేందుకు పంజాబ్‌ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ ఆహ్వానాన్ని మన్మోహన్‌ అంగీకరించారు. సుల్తాన్‌పూర్‌ లోధిలో భారత్‌ సరిహద్దు వద్ద జరిగే ప్రధాన కార్యక్రమంలోనూ మన్మోహన్‌ పాల్గొంటారు. కర్తార్‌పూర్‌ను సందర్శించే తొలి యాత్రికుల జాబితాలో మన్మోహన్‌తో పాటు పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌, ఆయన మీడియా సలహాదారు రవీన్‌ తక్రాల్‌ తదితరులున్నారు.

కాగా ప్రధాని నరేంద్ర మోదీని గురువారం కలిసిన పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ ప్రధానిని కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. కాగా మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా వ్యవహరించిన పదేళ్లలో ఎన్నడూ పాకిస్తాన్‌ను సందర్శించకపోవడం గమనార్హం. ప్రస్తుతం పాకిస్తాన్‌లోని పంజాబ్‌ ప్రావియన్స్‌లోని గా ప్రాంతంలో మన్మోహన్‌ జన్మించగా దేశ విభజన అనంతరం వారి కుటుంబం అమృత్‌సర్‌కు తరలివచ్చింది. మరోవైపు కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభోత్సవానికి డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ను ఆహ్వానిస్తామని పాక్‌ విదేశాంగ మంత్రి ఖురేషి ప్రకటించగా దీనిపై మన్మోహన్‌ సింగ్‌ అధికారికంగా స్పందిచాల్సి ఉంది. ఇక ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో జమ్ము కశ్మీర్‌ పరిణామాలపై భారత్‌-పాక్‌ మధ్య సంబంధాలు దెబ్బతిన్న క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీని విస్మరిస్తూ కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభోత్సవానికి మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను ఆహ్వానించాలని పాక్‌ నిర్ణయించిన సంగతి తెలిసిందే.

పాక్‌ వెళ్లేది లేదు..

కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభానికి తాము పాకిస్తాన్‌కు వెళుతున్నట్టు వచ్చిన వార్తలను పంజాబ్‌ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ తోసిపుచ్చారు. ఈ కారిడార్‌ ద్వారా తాను కర్తార్‌పూర్‌ సాహిబ్‌ గురుద్వారాకు వెళ్లే తొలి అఖిలపక్ష యాత్రకు సారథ్యం వహిస్తానని ఆయన స్పష్టం చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ సైతం కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభోత్సవానికి పాకిస్తాన్‌ వెళతారని తాను భావించడం​లేదని అన్నారు.

మరిన్ని వార్తలు