వెలుగు రేఖ భారత్

9 Jan, 2015 04:12 IST|Sakshi
  • ప్రవాసీ భారతీయ దివస్‌లో ప్రధాని మోదీ
  •  ప్రపంచ దేశాలన్నీ భారత్‌వైపు చూస్తున్నాయి
  •  దేశాభివృద్ధిలో భాగస్వాములు కండి
  •  ప్రవాస భారతీయులకు పిలుపు
  • గాంధీనగర్: ‘దేశంలో నెలకొని ఉన్న దారుణమైన ప్రతికూల పరిస్థితుల్లో మన పూర్వీకులు మెరుగైన భవిష్యత్తును వెతుక్కుంటూ.. అత్యంత ధైర్య సాహసాలతో దేశాన్ని విడిచి కొత్త తీరాలకు తరలి వెళ్లారు. ఇప్పుడా పరిస్థితి లేదు. భారత్ అభివృద్ధి చెందింది. అద్భుతమైన కొత్త, కొత్త అవకాశాలు మీ కోసం ఎదురుచూస్తున్నాయి. మరింత ప్రగతిశీల భారత్‌ను రూపొందించేందుకు మీ సహకారం కావాలి’.. అంటూ దేశాభివృద్ధిలో పాలుపంచుకోవాల్సిందిగా ప్రవాస భారతీయులను ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించారు.

    గాంధీనగర్‌లో 13వ ప్రవాస భారతీయ దివస్(పీబీడీ)’ను మోదీ గురువారం లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మహాత్మా మందిర్ వేదికపై నుంచి  దాదాపు 4 వేల మంది ఆహూతులనుద్దేశించి ప్రసంగించారు. దక్షిణాఫ్రికా నుంచి మహాత్మాగాంధీ భారత్‌కు తిరిగివచ్చి  వందేళ్లు పూర్తయిన సందర్భంగా గాంధీజీ భావనలకు అనుగుణంగా పీబీడీ కార్యక్రమాలను రూపొందించారు.

    మోదీ కూడా తన ప్రసంగంలో గాంధీ దార్శనికతను, సమకాలీనతను ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సంక్లిష్ట సమస్యలను గాంధీజీ నమ్మి, ఆచరించిన మానవతావాద విశ్వాసాలు పరిష్కరించగలవన్నారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉండగా, 2003 నుంచి దక్షిణాఫ్రికా నుంచి వందేళ్ల క్రితం గాంధీజీ భారత్ తిరిగొచ్చిన తేదీన ప్రవాస భారతీయ దివస్’ను నిర్వహించడం ప్రారంభించారు.
     
    మోదీ ప్రసంగం ముఖ్యాంశాలు..
    అంతర్జాతీయంగా చూస్తే ప్రవాస భారతీయులే మన దేశానికి విలువైన పెట్టుబడి. వారి అభివృద్ధికి ఎంత సహకరిస్తే.. అంతర్జాతీయంగా మన విలువ, ప్రాముఖ్యత అంత పెరుగుతుంది.

    నేను ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక  50 దేశాల అధినేతలతో భేటీ అయ్యాను. మేం మనసువిప్పి మాట్లాడుకున్నాం. ప్రపంచంలోని అతిపేద దేశాలు, అత్యంత ధనిక దేశాలు కూడా భారత్ వైపు సానుకూల దృష్టితో చూస్తున్నాయి. అలాంటి పరిస్థితులు చాలా అరుదుగా వస్తాయి.

    జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్వహించాలన్న తన ప్రతిపాదనను ఐక్యరాజ్య సమితి ఆమోదించిన తీరు భారత్‌పై వారికున్న ప్రేమను ప్రతిఫలించింది. ఐరాసలోని 193 దేశాల్లో 177 దేశాలు ఆ తీర్మానానికి మద్దతిచ్చాయి. వాటిలో 40 ముస్లిం దేశాలు. సాధారణంగా అలాంటి తీర్మానాలు ఆమోదం పొందేందుకు కనీసం రెండేళ్లు పడుతుంది. కానీ ఈ తీర్మానం కేవలం 100 రోజుల్లో ఆమోదం పొందింది.

    ప్రపంచ దేశాలు మనపై చూపే ప్రేమకు కారణం.. వారి దేశాల్లోని భారతీయుల సంపద కారణం కాదు. అక్కడి ప్రవాస భారతీయులు పాటిస్తున్న విలువలు, వారు నిలుపుకుంటున్న భారత సాంస్కృతిక వారసత్వం.. ఇవే ఆ ప్రేమకు కారణం.

    ప్రపంచ దేశాలు మనపై పెట్టుకున్న అంచనాలను నిలుపుకునే బాధ్యత ఇప్పుడు మనపై ఉంది.

    గంగానది ప్రక్షాళన మతపరంగా, పర్యావరణ పరంగా అత్యంత ముఖ్యమైన లక్ష్యం. అంతేకాదు, దాదాపు 40% జనాభా ఆర్థికాభివృద్ధికి అది కీలకం. ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోని చాలా గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. పర్యావరణమూ మెరుగవుతుంది. ఈ గంగ ప్రక్షాళన కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు కావాలన్నది నా ఆకాంక్ష.

    నేను ప్రవాస భారతీయులను ఎక్కువగా కలుస్తున్నానని కొందరనుకుంటున్నారు. కానీ మనవాళ్లను కలిస్తే మన శక్తి మరింత పెరుగుతుంది.

    డాలర్లు, పౌండ్లు ఇస్తేనే దేశాభివృద్ధిలో పాలుపంచుకోవడమని కాదు. ఆఫ్రికా దేశంలో పుట్టి, కెనడాలో స్థిరపడిన భారతీయ సంతతికి చెందిన ఒక ముస్లిం బాలిక 2001లో గుజరాత్‌లో తీవ్ర భూకంపం వచ్చినప్పుడు నెలల తరబడి ఇక్కడే ఉండి సహాయ చర్యల్లో పాలుపంచుకున్న విషయం నాకు గుర్తొస్తోంది.

    ఇప్పుడు గయానాలో భారతదేశ పండుగలైన హోళీ, దీపావళి జరుపుకుంటున్నారు. మారిషస్‌లో గంగాసాగర్ సరస్సును గంగానది జలంతో నింపారు. ఇవన్నీ ప్రాంతాలకతీతంగా భారతీయులందరినీ ఒక్కటి చేస్తాయి.

    న్యూయార్క్‌లోని మేడిసన్ స్క్వేర్‌లో నేనిచ్చిన హామీని నెరవేర్చుకున్నాను. భారతీయ సంతతి ప్రజలు(పీఐఓ), విదేశాల్లోని భారతీయ పౌరులు(ఓసీఐ).. ఈ రెండు వర్గాలను విలీనం చేస్తూ ఈ మంగళవారమే ఆర్డినెన్స్‌ను జారీ చేశాం. దీనివల్ల వారికి జీవితకాల వీసా, భారత్‌లో ఉన్నప్పుడు ప్రతీవారం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకపోవడం.. లాంటి సౌకర్యాలు లభిస్తాయి. త్వరలో ఢిల్లీలోని ప్రవాసీ భారతీయ కేంద్రం కూడా పనులు ప్రారంభించనుంది.
     
    పరస్పర ప్రయోజనకర భాగస్వామ్యం: సుష్మాస్వరాజ్

    దేశాభివృద్ధిలో భాగంగా.. పరస్పర ప్రయోజనకర సంబంధాలను ఏర్పర్చుకోవాలని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రవాస భారతీయులకు పిలుపునిచ్చారు.  పీబీడీలో గురువారం ఆమె మాట్లాడుతూ.. దృఢమైన, స్వయంసమృద్ధ భారతదేశం మీకెంత స్ఫూర్తిదాయకమో.. విజయవంతమైన, సుసంపన్నమైన, రాజకీయంగా ప్రభావశీలురైన మీరు భారతదేశానికి అంతే స్ఫూర్తిదాయకం’ అన్నారు. ‘భారతదేశ సుసంపన్న గతచరిత్ర పునరావృతమయ్యేలా.. భారతదేశం అభివృద్ధి చెందాలి. ఆ యజ్ఞంలో మీరంతా పాలుపంచుకోవాలి’ అని ఆమె అభ్యర్థించారు.
     
    శతాబ్దాలుగా మతమార్పిళ్లు: వెంకయ్య

    విదేశీ నిధులతో గత రెండొందల ఏళ్లుగా భారత్‌లో మతమార్పిళ్లు, పునఃమత మార్పిళ్లు జరుగుతున్నాయని, అది బహిరంగ రహస్యమేనని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. హిందూత్వ సంస్థలు చేపట్టిన ఘర్‌వాపసీ కార్యక్రమంపై పెద్ద ఎత్తున దుమారం రేగుతున్న సమయంలో ప్రవాస భారతీయ దివస్ వేదికపై పై వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మతమార్పిళ్లతో ప్రభుత్వానికి సంబంధం లేదని, అభివృద్ధి మాత్రమే తమ ప్రభుత్వ ఎజెండా అని స్పష్టం చేశారు. ‘భారత్‌లో అవకాశాలు’ అంశంపై మాట్లాడుతూ ఆధునిక పట్టణ భారత్‌ను రూపొందించేందుకు సహకరించాలని వెంకయ్య ప్రవాస భారతీయులను కోరారు. తెలంగాణలోని వరంగల్, ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి సహా ఘన సాంస్కృతిక వారసత్వం ఉన్న 12 పట్టణాలను సాంస్కృతిక, పర్యాటక కేంద్రాలుగా తీర్చి దిద్దేందుకు ‘హృదయ్’(హెరిటేజ్ డెవలప్‌మెంట్ అండ్ ఆగ్మెంటేషన్‌యోజన) పథకాన్ని రూపొందిం చామన్నారు.

    సత్య నాదెళ్లకు ప్రవాసీ అవార్డు

    మైక్రోసాఫ్ట్ కంపెనీ ముఖ్య కార్యనిర్వాహణాధికారి, తెలుగు తేజం సత్య నాదెళ్ల ‘ప్రవాసీ భారతీయ సమ్మాన్’ అవార్డు అందుకోనున్నారు. ప్రవాసీ భారతీయ దివస్ సందర్భంగా శుక్రవారం ఆయనతోపాటు మరో 14 మందికి  ఈ అవార్డును ఇవ్వనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. వివిధ రంగాల్లో సేవలందించిన ఎన్నారైలకు ఈ అవార్డును అందిస్తున్నారు. గాంధీనగర్‌లోని మహాత్మ మందిర్‌లో ఉపరాష్ట్రపతి ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు.
     
    దండి కుటీర్

    13వ ప్రవాస భారతీయ దివస్ కార్యక్రమంలో భాగంగా జాతిపిత మహాత్మా గాంధీ జీవిత విశేషాలతో రూపొందించిన మ్యూజియం ‘దండి కుటీర్’ను మోదీ ప్రారంభించారు. మహాత్ముడిపై రూపొందించిన 3-డీ షార్ట్ ఫిల్మ్‌ను కూడా మోదీ వీక్షించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి యువత ప్రేరణ పొందేలా గాంధీ జీవితాన్ని మలచాలనే కల సాకారం కావడం హృద్యంగా ఉందన్నారు. ఉప్పుపై బ్రిటిష్ పాలకులు పన్ను విధించడాన్ని వ్యతిరేకిస్తూ గాంధీ చేపట్టిన దండి మార్చ్‌కు గుర్తుగా 41 మీటర్ల ఎత్తయిన ఉప్పు గుట్టను మ్యూజియంలో ఏర్పాటు చేశారు. అదేవిధంగా గాంధీ బాల్యం, స్వాతంత్య్ర సమరంలో ఆయన పోషించిన పాత్ర, భారత్‌కు తిరిగి రావడం వంటి ఘటనలను శిల్పాలుగా రూపొందించారు.
     
    స్టాంపులు, నాణేలు!

    ప్రవాస భారతీయ దివస్ కార్యక్రమంలో మహాత్మాగాంధీ ముఖచిత్రం ఉన్న నాణేలు, స్టాంపులను ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించారు. దక్షిణాఫ్రికా నుంచి గాంధీజీ భారత్‌కు తిరిగివచ్చి వందేళ్లు పూర్తయినందుకు గుర్తుగా వీటిని రూపొందించారు. యువకుడిగా ఉన్నప్పటి మోహన్‌దాస్ కరంచంద్ గాంధీని.. మహాత్ముడిగా మరిన తరువాత గాంధీని ఒకే ఫ్రేములో చూపిస్తూ వాటిని రూపొందించారు. రూ. 100, రూ. 10 నాణేలను, రూ. 25, రూ. 5 విలువైన స్టాంపులను తయారు చేశారు.
     

మరిన్ని వార్తలు