నా సక్సెస్‌ సీక్రెట్‌ అదే: గౌరంగీ చావ్లా

2 May, 2019 20:43 IST|Sakshi
గౌరంగీ చావ్లా (ఎఫ్‌బీ ఫొటో)

రిషికేశ్‌: ‘నేనేమి పుస్తకాల పురుగును కాదు. అన్ని విషయాల్లో చురుగ్గా ఉండాలనుకుంటాను. పరిస్థితులకు తగ్గట్టుగా ముందుకెళుతుంటా. స్వీయ నియంత్రణే నా మంత్రం. పరీక్షల సమయంలో ఒత్తిడి నుంచి బయటపడేందుకు కామ్‌గా, రిలాక్స్‌డ్‌గా ఉంటాన’ని గౌరంగీ చావ్లా వెల్లడించింది. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌(సీబీఎస్‌ఈ) గురువారం ప్రకటించిన పన్నెండో తరగతి పరీక్షా ఫలితాల్లో 500 గానూ 498 మార్కులు సాధించి ఆమె రెండో ర్యాంకు దక్కించుకుంది.

ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో ఉన్న నిర్మల్‌ ఆశ్రమ్‌ దీపమాల పబ్లిక్‌ స్కూల్‌లో చదివిన ఆమె పొలిటికల్‌ సైన్స్‌, ఇంగ్లీషు తప్పా మిగతా సబ్జెక్టుల్లో వందకు వంద మార్కులు తెచ్చుకుంది. రెండో ర్యాంకు రావడం పట్ల గౌరంగీ సంతోషం వ్యక్తం చేసింది. ఇన్ని మార్కులు వస్తాయని ఊహించలేదని, ఇంగ్లీషులో 99 మార్కులు తెచ్చుకోవడం మామూలు విషయం కాదని పేర్కొంది. ఇంగ్లీషు సబ్జెక్టు చదివేటప్పుడు విద్యార్థులు సాధారణంగా లిటరేచర్‌ మీద దృష్టి పెడతారని, తాను మాత్రం గ్రామర్‌ మీద ఫోకస్‌ చేశానని వెల్లడించింది. (చదవండి: హన్సిక ఈజ్‌ ద బెస్ట్‌!)

తన విజయానికి తల్లిదండ్రులు, టీచర్లతో పాటు తన బెస్ట్‌ ఫ్రెండ్‌ దేవేంద్ర పరిహార్‌ కారణమని తెలిపింది. జియోగ్రఫీ(హానర్స్‌) చేసిన తర్వాత సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుతానని తన భవిష్యత్‌ ప్రణాళికల గురించి చెప్పింది. ఒత్తిడిని అధిగమించేందుకు, సందేహాలను నివృత్తి చేసుకునేందుకు తనలో తాను మాట్లాడుకునేదాన్నని గౌరంగీ వివరించింది. ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలీ కేంద్రీయ విద్యాలయ విద్యార్థిని ఐశ్వర్య, హర్యానాకు చెందిన భవ్య కూడా 498 మార్కులు సాధించి గౌరంగీ పాటు సంయుక్తంగా రెండో ర్యాంకులో నిలిచారు. హన్సిక శుక్లా(ఘజియాబాద్‌), కరిష్మా అరోరా 499 మార్కులతో సంయుక్తంగా ఫస్ట్‌ ర్యాంకు సాధించారు. (చదవండి: 500కు 499 మార్కులు.. మళ్లీ వాళ్లే టాప్‌!)

>
మరిన్ని వార్తలు