రైళ్ల ప్రైవేటీకరణకు కమిటీ

11 Oct, 2019 04:33 IST|Sakshi

50 స్టేషన్ల అభివృద్ధి, 150 రైళ్ల ప్రైవేటీకరణకు నిర్ణయం

న్యూఢిల్లీ: నిర్ణీత కాలపరిమితితో దేశంలోని 150 పాసింజర్‌ రైళ్లను ప్రైవేటీకరించేందుకు, 50 రైల్వే స్టేషన్లను ప్రైవేటు ఆపరేటర్లకు ఇచ్చేందుకు కేంద్రం మరో అడుగువేసింది. ఈ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల నీతిఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ ఈ విషయమై రైల్వే బోర్డు చైర్మన్‌ వీకే యాదవ్‌కు ఇటీవల లేఖ రాశారు. ప్రభుత్వం ఏర్పాటుచేసే సాధికారిక యంత్రాంగం (కమిటీ) ఈ ప్రక్రియ అమలు తీరుని పర్యవేక్షిస్తుందని ఆయన ఆ లేఖలో తెలిపారు.

వీకే యాదవ్, అమితాబ్‌లతోపాటు ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి, గృహ, పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి ఉంటారు. రైల్వే బోర్డు ఇంజనీరింగ్‌ సభ్యుడు, ట్రాఫిక్‌ రైల్వే బోర్డు సభ్యుడిని కూడా ఈ సాధికారిక యంత్రాంగంలో భాగం చేయాలని అమితాబ్‌ కాంత్‌ తెలిపారు. ‘ప్రపంచస్థాయి ప్రమాణాలకు దీటుగా తొలుత కనీసం 50 రైల్వేస్టేషన్లను నవీకరించాలి. అలాగే అంతర్జాతీయస్థాయి సదుపాయాలతో, ప్రపంచస్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో మొదటిదశలో 150 రైళ్లను నడపడానికి రైల్వే శాఖ ప్రైవేటు ఆపరేటర్లకు ఇప్పటికే అనుమతి ఇచ్చింది’ అని అమితాబ్‌కాంత్‌ పేర్కొన్నారు. బిడ్డింగ్‌ ప్రక్రియను ఆమోదించే అధికారం ఈ కమిటీకే ఉంటుంది. ‘ఆరు విమానాశ్రయాలను ప్రైవేటీకరించడంతో వచ్చిన ఫలితాలను బేరీజు వేస్తే, సాధికారిక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నాం’ అని ఆయన అన్నారు.

మరిన్ని వార్తలు