అద్భుతం చేసిన చెన్నై డాక్టర్లు..!

10 Nov, 2018 10:09 IST|Sakshi

రెండు చేతులకు తిరిగి ప్రాణం

సాక్షి, చైన్నై : నేటి ఆధునిక యుగంలో సాంకేతికత ఎంత పెరిగిందో.. ప్రమాదాల శాతం అంతే పెరిగింది. ప్రమాదాల్లో కొందరు ప్రాణాలు కోల్పోతే.. మరికొందరు తీవ్రంగా గాయపడి అవయవాలు పోగొట్టుకుంటున్నారు. దీంతో బతుకు దుర్భరంగా మారుతోంది. అయితే, అలాంటి వారికి సరైన వైద్యం అందితే తిరిగి మామూలు మనుషులయ్యే అవకాశం ఉంది. విద్యుతాఘాతంతో రెండు చేతులు కోల్పోయిన ఓ వ్యక్తికి ట్రాన్స్‌ప్లాంటేషన్‌ పద్ధతి ద్వారా తిరిగి చేతులను అతికించారు చెన్నై డాక్టర్లు. 13 గంటల సుదీర్ఘ ఆపరేషన్‌తో గవర్నమెంట్‌ స్టాన్లీ మెడికల్‌ కాలేజ్‌  డాక్టర్లు సరికొత్త చరిత్ర సృష్టించారు.

వివరాలు.. హైదరాబాద్‌లోని దుండిగల్‌కు చెందిన నారాయణ స్వామి మేస్త్రీ​ పని చేసేవాడు. 2015లో ఓ ఇంటి నిర్మాణం చేస్తుండగా ప్రమాదవశాత్తూ కరెంట్‌ షాక్‌కు గురయ్యాడు. ఈ ఘటనలో అతను రెండు చేతులూ కోల్పోయాయి అవిటివాడయ్యాడు. ఈ క్రమంలో బ్రెయిన్‌డెడ్‌ అయిన ఓ వ్యక్తికి చెందిన రెండు చేతులను నారాయణ స్వామికి చెన్నై డాక్టర్లు ట్రాన్స్‌ప్లాంట్‌ చేసి అతికించారు. ఈ ఆపరేషన్‌ గత ఫిబ్రవరిలో జరగగా.. నారాయణ స్వామి, డాక్టర్లు తాజాగా మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు. మొబైల్‌ ఫోన్‌ వాడడం, తేలిక పాటి వస్తువులు ఎత్తడం వంటి పనులు చేస్తున్నాడిప్పుడు నారాయణ స్వామి. నిజంగా వైద్యో నారాయణో హరియే కదా..!!  కాగా, తమిళనాడు చరిత్రలో ఇదే తొలి హ్యాండ్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ఆపరేషన్‌ కావడం విశేషం.

మరిన్ని వార్తలు